ఫిర్యాదుదారులతో బాధ్యతాయుతంగా మెలగాలి
పాలమూరు ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 22: ప్రజల నమ్మకాన్ని పొందడంలో పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎస్పీ రావిలాల వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం పాలమూరు జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతి భద్రతల సమీక్షా సమావేశం నిర్వహించారు. హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఆయా పోలీసు స్టేషన్ల వారీగా ఉన్న వివిధ కేసుల పరిశోధనను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే నిందితులకు శిక్ష ఖాయమమ్యేందుకుగానూ దర్యాప్తు పదునుగా ఉండాలన్నారు. కేసుల పరిశోధనలో దర్యాప్తు అధికారి తనదైన వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల బాధితులకు న్యాయం జరగడంతోపాటు అధికారికీ గుర్తింపు లభిస్తుందన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో బాధ్యతాయుతంగా మాట్లాడుతూ వారికి సాంత్వన చేకూర్చే రీతిలో వ్యవహరించాలని ఆయన సూచించారు. వచ్చే ప్రతి పిటీషన్ను స్టేషన్ అధికారి పరిశీలించడం, సిబ్బందికి సూచనలు చేయడం వల్ల పనిలో వేగం, పట్టు పెరుగుతాయన్నారు. పని విభజనపై అవగాహన ఉన్న అధికారి విజయవంతమవడం ఖాయమన్నారు. కొవిడ్ పరిస్థితులను, నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలీసు అధికారి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నైట్ కర్ఫ్యూ విధించిన పరిస్థితులు ప్రజలకు అర్థమయ్యేలా చెబుతూ ప్రతి ఒక్కరూ చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు. అనంతరం రానున్న ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ఎస్పీ అడ్మిన్ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ శ్రీరాం కుమార్, డీఎస్పీ సాయి మనోహర్, అధికారులు పాల్గొన్నారు.