కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
పావలా వడ్డీకే రూ.18.70 కోట్ల రుణాలు
1,247 మంది లబ్ధిదారులకు చేయూత
రాజన్న సిరిసిల్ల, మే 26 (నమస్తే తెలంగాణ): మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. పావలా వడ్డీ రుణాలతో ప్రోత్సాహస్తున్నది. ఇప్పటికే అనేక మంది మహిళలు కిరాణా దుకాణాలు, బ్యాంగి ల్ స్టోర్స్లు పెట్టుకుని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటున్న మహిళలను స్మాల్స్కేల్ ఇండస్ట్రీస్ వైపు మళ్లించి, భారీ ఎత్తున ఉపాధి కల్పించాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. మంత్రి మార్గదర్శకత్వంలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పిండిగిర్నీలు, ఇతరత్రా కుటీర పరిశ్రమలతో ప్రోత్సహించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలో 1,247 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఒక్కో మహిళకు రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించనుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
సర్కారు మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వశక్తి సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా పెద్ద ఎత్తున పావలా వడ్డీ రుణాలు ఇచ్చి చేయూతనిచ్చింది. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడంలో మహిళలు ముందు వరుసలో ఉన్నారు. అందుకే బ్యాంకులు కూడా మహిళలకు రుణాలిచ్చేందుకు పోటీ పడుతున్నాయి. తీసుకున్న రుణాలతో బ్యాంగిల్స్ స్టోర్లు, కిరాణా దుకాణాలు, ఇతరత్రా వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న వీరిని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాజాగా రూ.18.70 కోట్లు విడుదల చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను విస్తరించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వీటి నిర్వహణ బాధ్యతను మహిళలకే అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకంతో సర్కారు గ్రామీణాభివృద్ధి శాఖకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా 255 పంచాయతీల్లో 1,247 మందిని ఎంపిక చేసింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణాలివ్వాలని నిర్ణయించింది. చిన్న పరిశ్రమల స్థాపనలో కొత్తకొత్త యూనిట్లను నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో తొలి విడుతగా ఓ మహిళకు పిండిగిర్నీ మంజూరు చేసింది. కుటీర పరిశ్రమల స్థాపనతో ఎలాంటి లాభాలుంటాయో తెలుపుతూ పదిమందికి లభించే ఉపాధిపై అవగాహన కల్పిస్తున్నది.
98 రకాల యూనిట్లు
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి సంస్థ 98 రకాల యూనిట్లను స్థాపించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో ఎక్కువ శాతం మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు పది మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. స్వయం ఉపాధిలో జిల్లాను అగ్రభాగాన నిలుపాలన్న లక్ష్యం తో అధికారులు కొత్త ఆలోచనలను ఆవిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆటో రిక్షాల మరమ్మతు, అగర్బత్తీల తయారీ, ఆటో, జీపు, కార్ల రిపేరు షెడ్లు, బేకరీ, గాజుల తయారీ యూ నిట్లు, బ్యూటీ పార్లర్లు, ఇటుకల తయారీ, కా ర్పెంటరీ, సెంట్రింగ్, సిమెంట్ కాంక్రిట్ మిక్సిం గ్ యూనిట్లు, సూపర్మార్కెట్లు, టెంట్ హౌస్ లు, గ్రానైట్ క్వారీలు తదితర యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవే కాకుండా కొత్తదనంగా ఉండి మహిళలు సమర్థవంతగా చేయగలిగే చిన్నచిన్న యూనిట్ల మంజూరుపై దృష్టిసారించారు. ఇందులో సక్సెస్ అయితే మరిన్ని యూనిట్లు జిల్లాకు తెచ్చే ఆలోచనలు చేస్తున్నారు.
మండలాల వారీగా లబ్ధిదారులు
జిల్లాలో 1,247 మంది లబ్ధిదారులను ఎంపి క చేశారు. బోయినపల్లిలో 93, చందుర్తిలో 93, ఇల్లంతకుంటలో 140, గంభీరావుపేటలో 141, కోనరావుపేటలో 116, ముస్తాబాద్లో 172, రుద్రంగిలో 51, తంగళ్లపల్లిలో 133, వీర్నపల్లిలో 58, వేములవాడలో 45, వేములవాడరూరల్లో 65, ఎల్లారెడ్డిపేట మండలంలో 140 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు.
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా..
మహిళల అభివృద్ధే లక్ష్యంగా, పది మందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను విస్తరింపజేసి, పది మందికి ఉపాధి కల్పించాలన్నది మంత్రి కేటీఆర్ ఉద్దేశం. ఆయన మార్గదర్శకత్వంలో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణాలివ్వనున్నాం. జిల్లాలో 1,247 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. – కె.కౌటిల్యారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి