హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎవరినీ వదిలి పెట్టడం లేదు. విప్లవ సాధన కోసం అడవులను క్షేత్రాలుగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటివరకు భద్రతా దళాలతో పోరాడే మావోయిస్టులు.. ఇప్పుడు కోవిడ్-19తోనూ పోరాడాల్సిన దుస్థితిలో ఉన్నారు.
తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోని అడవుల్లో విస్తరించి ఉన్న మావోయిస్టులు ఇంతకుముందు చికున్గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయేవారు. తాజాగా ప్రాణాంతక కరోనా మహమ్మారి విసిరిన పంజాకు అగ్రశ్రేణి మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోయారని నక్సలైట్ల వ్యతిరేక ఇంటెలిజెన్స్ వింగ్.. స్పెషల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, నాయకురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్కలు కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
కరోనా సెకండ్ వేవ్ వల్ల కనీసం ఎనిమిది మంది మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మరో 15-20 మంది తీవ్రంగా కరోనా బారిన పడ్డారని పోలీస్ వర్గాల కథనం. కరోనా భయంతోనే మరికొందరు పార్టీని వీడారని సమాచారం.
సకాలంలో వైద్య చికిత్స అందకపోవడం, పాడైన ఆహారం తినడం, పాము కాటు వంటి ఘటనలతోపాటు ప్రకృతిలో వైవిధ్య భరితమైన మార్పుల వల్ల మావోయిస్టుల ఆరోగ్యం దెబ్బ తింటున్నది.