ధారూరు, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా 30 రోజుల ప్రణాళికతో గ్రామం అభివృద్ధి ప్రారంభమైంది. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలో ప్రతి ఇంటికీ వ్యక్తి గత మరుగుదొడ్డి, ఇంకుడు గుంత, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్, గ్రామ నర్సరీ, పల్లె ప్రకృతి వనం, పంచాయతీ ట్రాక్టర్తో పారుశుద్ధ్య పనుల నిర్వహణతో గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. ధారూరు మండలంలోని అంతారం గ్రామ రూపురేఖలను పల్లె ప్రగతి పూర్తిగా మార్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, గ్రామకమిటీ సభ్యులు, ప్రజలతో పాటు అధికారులు ఉత్సాహంగా గ్రామంలో విస్తృతంగా అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో గ్రామం అభివృద్ధి దిశలో పయనిస్తుంది.
పారిశుద్ధ్య నిర్వహణతో స్వచ్ఛ వీధులు
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో ప్రతిఒక్కరూ తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్యార్డు ఏర్పాటుచేశారు.
పాడుబడ్డ బావుల పూడ్చివేత
గ్రామంలో 30రోజుల ప్రణాళిక, 10రోజుల పల్లె ప్రగతిలో భాగంగా పనులు ప్రారంభించారు. గ్రామంలో పురాతన ఇండ్లను, పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల కంపను తొలగించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, వ్యక్తి గత మరుగుదొడ్డి నిర్మించుకుని వినియోగించుకుంటున్నారు.
ఇంటింటికీ భగీరథ నీరు సరఫరా
గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేస్తున్నారు. గతంలో తాగునీరు కావాలంటే పంట పొలాల నుంచి తెచ్చుకునేవారు. మూడేండ్లుగా మిషన్ భగీరథ పథకం ద్వారా నీటికి ఇబ్బందులు లేవు. గ్రామంలోనే మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి ట్యాంక్ ఏర్పాటు చేసి పుష్కలంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. పచ్చదనంతో ఆకట్టుకునే హరితహారం మొక్కలు పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామంలోని నర్సరీలో 11 వేలు మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలను వచ్చే హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. నర్సరీలోనూ 11వేలు మొక్కలు పెంచుతున్నారు. టేకు, గుర్భమా, జామ, గచ్చకాయ, కుంకుడు, గులాబీ, మందారం, తులసీ, గానుగా, కరురా, చింత తదితర మొక్కలను పెంచుతున్నారు. గత హరిత హారంలో నాటిన మొక్కలను కాపాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నాటిన మొక్కలకు ప్రతి దినం నీరు అందించి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలం, ఖాళీ స్థలాల్లో, దేవాలయాల్లో, పాఠశాల ఆవరణలో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటున్నారు.
అందమైన పల్లె ప్రకృతివనం
పల్లె ప్రకృతి వనంలో 4వేలు మొక్కలు నాటి అన్ని రకాల మొక్కలతో అందంగా తయారుచేశారు. పల్లె ప్రకృతి వనంలో జామ, అల్లనేరేడు, ఆశోక మొక్కలను నాటి అందంగా తయారు చేశారు. ప్రకృతి వనంలో ఆశోక, అల్లనేరడు, చైనా బాధం, తదితర మొక్కలు నాటి వాటిని కాపాడుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు ప్రకృతి వనం మధ్యలో అందమైన రోడ్లు వేశారు.