నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
పీపీఈ కిట్లు ధరించి కరోనా వార్డుల పరిశీలన
నిర్మల్ అర్బన్, మే 6 : కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ డాక్టర్లకు సూచించారు. నిర్మల్లోని జిల్లా ప్రధాన వైద్యశాల, మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. జిల్లా వైద్యశాలలోని ఐసొలేషన్ వార్డును పీపీఈ కిట్లు ధరించి పరిశీలించారు. కొవిడ్ బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి బాగోగులు, వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటల పాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంచామని తెలిపారు. రోగులకు సంబంధించిన ఖాళీ బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు.అనంతరం దవాఖాన ఆవరణలో చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ప్రభుత్వ మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో స్కానింగ్ సెంటర్, ల్యాబ్, ఓపీ వార్డు, రోగుల వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు దేవేందర్ రెడ్డి, రజినీ పాల్గొన్నారు.