ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక్కడ 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో ఉండనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. జూన్ 18 నుంచి సౌథాంప్టన్లో న్యూజిలాండ్తో జరగబోయే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. ఇండియాలోని బబుల్ నుంచి ఇంగ్లండ్లోని బబుల్లోకి చార్టర్డ్ ప్లేన్లో వెళ్తారు కాబట్టి.. అక్కడ క్వారంటైన్లో ఉంటూనే ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుందని ఆ అధికారి చెప్పారు. బబుల్లో ఉన్న సమయంలో క్రికెటర్లకు ఎప్పటికప్పుడు కరోనా టెస్టులు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ సిరీస్ సెప్టెంబర్ 14న ముగుస్తుంది. అంటే మూడు నెలలకుపైనే క్రికెటర్లు ఇంగ్లండ్లో ఉండనున్నారు. దీంతో ప్లేయర్స్ తమ వెంట కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లే అవకాశం కల్పించనున్నట్లు ఆ బీసీసీఐ అధికారి చెప్పారు. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్కు, టెస్ట్ సిరీస్ ప్రారంభానికి మధ్య నెల రోజుల కంటే ఎక్కు సమయం ఉంటుంది. ఆగస్ట్ 4న ఇంగ్లండ్తో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. ఇక ప్లేయర్స్కు వ్యాక్సినేషన్ అంశం కూడా చాలా ముఖ్యమైనదని, అయితే తొలి డోసు ఇక్కడ వేయించుకునే అవకాశం ఉన్నా.. రెండో డోసు మాత్రం కుదరదని ఆ అధికారి తెలిపారు. దీంతో రెండో డోసును యూకేలో వేయించే అంశంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చర్చిస్తుందని చెప్పారు.