ఆకట్టుకుంటున్నశిల్పకలా ఖండాలు
ఒకే రకం కృష్ణశిలతో నిర్మించిన ఏకైక సప్తతల రాజగోపురం
యాదాద్రి, మే 10: ఆలయం చుట్టూ అష్టభుజి మండపం.. నింగిని తాకేలా సప్త రాజగోపురాలు.. భక్తులను కట్టిపడేసేలా శిల్పకళా ఖండాలు ఎటూ చూసినా ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా స్థపతులు యాదాద్రి లక్ష్మీనారసింహుడి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయానికి మకుటాయమానంగా సప్త రాజగోపురాలు నిలుస్తున్నాయి. ఏడంతస్తుల రాజగోపురం, నాలుగు పంచతల రాజగోపురం, త్రితల రాజగోపురం, విమానం పనులు పూర్తికాగా నలుదిక్కులా తమ రాజసాన్ని ప్రదర్శిస్తూ హుందాగా కనువిందు చేస్తున్నాయి. ఒకే రకం కృష్ణశిలతో నిర్మించిన ఏకైక సప్తతల రాజగోపురం ప్రపంచంలోనే ప్రథమంగా యాదాద్రిలో నిర్మించడం ఒక ప్రత్యేకత అని స్థపతులు చెబుతున్నారు. గతంలో ఉన్న రాజగోపురాలకు సున్నాలు, రంగులు వేసేవారు. కానీ ప్రస్తుత రాజగోపురాలు సహజమైన కృష్ణ శిలలతోనే కనువిందు చేయనున్నాయి. ప్రధానాలయంపై 48 అడుగుల ఎత్తులో విమానం, ఆలయ చుట్టూ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ భాగంలో 55 అడుగుల ఎత్తులో నాలుగు పంచతల రాజగోపురాలు నిర్మించారు. సప్తతల రాజగోపురం సుమారు 85 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఆలయంలోకి వెళ్లేందుకు ఈశాన్యంలో సంప్రదాయంగా త్రితల రాజగోపురం 40 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఒక్కో గోపురానికి ద్వారపాలకులు, వైష్ణవమూర్తుల విగ్రహాలను బిగింపుతో గోపురాలను భక్తులను ఆకట్టుకోనున్నాయి. పంచతల రాజగోపురానికి 40 విగ్రహాలు, సప్తతల రాజగోపురానికి 54 ద్వారపాలకులు, వైష్ణవమూర్తుల విగ్రహాలను అమర్చారు