హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కరోనా సోకింది. ఆయనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం వెల్లడించారు. సీఎంకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసొలేషన్లో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని సీఎస్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. సీఎంకు చాలా మైల్డ్ లక్షణాలున్నాయని, హోం ఐసొలేషన్ సరిపోతుందని చెప్పారు. మరో తొమ్మిది రోజులపాటు సీఎం హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సీఎంకు తొలుత యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చిందని, దీంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా నిర్వహించామని తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం రావాల్సి ఉందని అన్నారు. సోమవారం మధ్యాహ్నం తనతోపాటు ఇంకో ఇద్దరు డాక్టర్లం వెళ్లి పరీక్షించామని డాక్టర్ రావు తెలిపారు. రాత్రి కూడా ఒక డాక్టర్ పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ ఉంటారని వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన పని లేదు, ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఏదైనా అవసరమైతే సోమాజిగూడ యశోద దవాఖానలో సీఎం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. సెకండ్ వేవ్ చాలామందికి వ్యాపిస్తున్నదని, సీఎం కేసీఆర్కు ఎక్కడ కరోనా అంటుకున్నదన్న విషయాన్ని చెప్పలేమని ఎంవీరావు అన్నారు.
ప్రజల దీవెనలే సీఎం కేసీఆర్ను కాపాడుతాయని మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. పేదల దైవం ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పేద ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలే సీఎం కేసీఆర్కు శ్రీరామరక్ష అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. సీఎంకు కరోనా రావడంతో రాష్ట్ర ప్రజలు, వ్యక్తిగతంగా తాను ఆందోళన చెందుతున్నట్టు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ప్రార్థనలు ఫలించి అతి త్వరలోనే సీఎం కేసీఆర్ కరోనాను జయించి బయటకు వస్తారని గుత్తా ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తెలిపారు. కేసీఆర్ మనోధైర్యం, పట్టుదలకు తోడు కోట్లాది మంది తెలంగాణ ప్రజల దీవెనలు ఆయనను త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుస్తాయని కేకే ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్కున్న మనోధైర్యం, ఆత్మబలం అసాధారణమైందని, ఆయన త్వరగా కోలుకుంటారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవరెడ్డి, కోలేటి దామోదర్గుప్తా తదితరులు ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ త్వరంగా కోలుకొని, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. సీఎం త్వరగా కోలుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ జాతీయ ఓబీసీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, కాంగ్రెస్నేత, ఎంపీ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, రాష్ట్ర మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కే పాపారావు, టీఈఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శివాజీ, తెలుగు సినిమా దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్ శంకర్, టీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు తదితరులు ఆకాక్షించారు.
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే సీఎం కేసీఆర్ కొవిడ్ను సునాయాసంగా జయిస్తారని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి నాయకంటి ప్రతాప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోట్లాది మంది ప్రజల దీవెన, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల అభిమానాలు దండిగా ఉన్న సీఎం కేసీఆర్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మనముందుకు వస్తారని తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ పద్మాచారి ఆకాంక్షించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ధైర్యవంతుడు, పోరాట యోధుడని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కొవిడ్ను జయిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. స్వల్ప కరోనా లక్షణాలతో ఉన్న సీఎం కేసీఆర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ‘సీఎం కేసీఆర్కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వేలమంది ఆయన యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రజాశీర్వాద బలం, ప్రార్థనల వల్ల యోధుడైన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకొని కోవిడ్ను జయిస్తారు’ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి సత్వరమే కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఎన్ సుధాకర్రావు ఆకాంక్షించారు. గుండె బలం నిండుగా కలిగిన కేసీఆర్ రక్తంలోనే పోరాట జ్వాల నిండి ఉందని, ఆ స్ఫూర్తితోనే ఆయన కరోనా వైరస్నూ ఓడిస్తారని అన్నారు. దేవుని ఆశీస్సులు, తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్కు కవచాలుగా ఉన్నాయని, వాటి అండతో ఆయన పూర్తి ఆరోగ్యంతో, సురక్షితంగా బయటకు వచ్చి మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవుతారని పేర్కొన్నారు. ధైర్యం, ఆత్మైస్థెర్యం కలిగిన కేసీఆర్కు వైరస్ను ఓడించడం పెద్ద కష్టం కాదని, తద్వారా ఆయన విపత్తు వేళ ప్రజలకు మరోసారి స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు.
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి
సీఎం కేసీఆర్కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంపట్ల గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నట్టు ఆమె తెలిపారు.
-తమిళిసై సౌందర్ రాజన్, గవర్నర్
త్వరగా కోలుకోవాలి
‘సీఎం కేసీఆర్కు స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’
కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
ప్రజల ఆశీర్వాదంతో కోలుకుంటారు
యోధుడైన కేసీఆర్కు కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలున్నాయి. ఆయన త్వరలోనే కోలుకుంటారు.
సంతోష్కుమార్, రాజ్యసభ సభ్యుడు
ప్రజల దీవెనతో త్వరగా కోలుకుంటారు
‘మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. కేసీఆర్ క్రమశిక్షణ, ఆయన మనోైస్థెర్యం చాలా గొప్పవి. కోట్లాది మంది తెలంగాణ ప్రజల దీవెనతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నా’
టీ హరీశ్రావు, ఆర్థికశాఖ మంత్రి
పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరలోనే కుదుటపడుతుందని ఆశిస్తున్నాను. కేసీఆర్ మనోధైర్యం, పట్టుదలకు తోడుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల దీవెనతలో త్వరలోనే మన ముందుకు వస్తారు.
వినోద్కుమార్ , రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సీఎం కోసం ప్రార్థిస్తున్నా: చిరంజీవి, మహేశ్బాబు
‘విష్ యూ స్పీడీ రికవరీ సార్’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సినీనటుడు మహేశ్బాబు ట్విట్టర్లో తెలిపారు.