మహబూబ్ నగర్ : కరోనా కేసుల సంఖ్య విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లో అందుతున్న వైద్య సేవలను ఆయన గురువారం సాయంత్రం పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా 3 కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేవరకద్ర, కోయిలకొండ, బాలానగర్లో కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేవరకద్ర, కోయిలకొండలో కేజీవీబీల్లో, బాలానగర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కరోనా రోగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో అన్ని రకాల సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. జనరల్ దవాఖానలో 250 పడకల ప్రత్యేక దవాఖాన విజయవంతంగా రోగులకు సేవలు అందిస్తోందన్నారు.
చిన్న చిన్న ఇండ్లు ఉంటి ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న వారు కొవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు హోం ఐసోలేషన్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని… అలాంటి వారికి కొవిడ్ కేర్ సెంటర్లలో ఐసోలేషన్ లో ఉండేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అవసరమైతే ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలు, రెమెడిసివర్ ఇంజక్షన్లు అన్నీ ఉన్నాయన్నారు. మంత్రి వెంట జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డా.రాంకిషన్, డా.జీవన్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
హత్యకేసు నిందితుడికి జీవిత ఖైదు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం