న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల స్వతంత్ర ప్రతిపత్తి, పరిరక్షణలకు రాజ్యాంగంలో అనేక ఏర్పాట్లు ఉన్నాయి. వాటిని కింది విధంగా పరిశీలించవచ్చు.
నియామకం: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అర్హతలను రాజ్యాంగమే నిర్ణయించింది.
పదవీకాల భద్రత: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తమ పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు పదవిలో ఉంటారు. కార్యనిర్వాహక శాఖ, న్యాయమూర్తులను నియమించినప్పటికీ వీరిని తొలగించలేదు. పదవీకాలం స్వల్పకాలంలోనే ముగుస్తుందనే ఆందోళన ఉండదు. ఇది న్యాయ శాఖ నిష్పక్షపాత వైఖరికి దోహదం చేస్తుంది.
జీతభత్యాలు: సరైన వేతనాలు ఉన్నప్పుడే నిబద్ధతతో పనిచేయగలుగుతారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ న్యాయమూర్తుల జీతభత్యాలను నిర్ణయిస్తుంది. జీతభత్యాలకు సంబంధించిన చర్చ పార్లమెంటులో జరుగుతుంది. కానీ ఓటింగ్ జరగదు. వీటిని సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవిలో ఉండగా జీతాలను తగ్గించడానికి వీలులేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తప్పజీతభత్యాలను తగ్గించరాదు. ఈ ఏర్పాటు కూడా న్యాయశాఖ పనితీరును ప్రభావితం చేస్తుంది.
న్యాయమూర్తుల ప్రవర్తనపై చర్చ నిషేధం:ప్రకరణ 121 ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు దేశంలోని ఏ కోర్టులోనూ లేదా ఏ అథారిటీ ఎదుట వాదించరాదు. (న్యాయవాద వృత్తి చేపట్టరాదు) అయితే పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులు వారు పనిచేసిన హైకోర్టులో తప్ప ఏ కోర్టులోనైనా న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు.
కోర్టు తీర్పులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా/అమలుచేయకపోయినా/ తీర్పులకు పక్షపాతం ఆపాదించినా అటువంటి వారిని ప్రకరణలు 129, 215 ప్రకారం శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. ఉదాహరణకు వాసుదేవన్ అనే కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్కు కోర్టు ధిక్కార నేరం కింద నెలరోజుల జైలు శిక్ష విధించింది.
పైన తెలిపిన రక్షణలు న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తికి, నిష్పక్షపాత వైఖరికి దోహదం చేస్తాయి.