న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకా ముమ్మరంగా సాగుతున్నది. అన్ని రాష్ట్రాలు 18 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నాయి. త్వరలోనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సైతం టీకాలు వేయనున్నారు. జూలై తర్వాత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. థర్డ్ వేవ్లో కరోనా వేగంగా విస్తరించడంతో పాటు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే వార్తలున్నాయి. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలపై భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభించిందని ఐసీఎంఆర్ తెలిపింది.
ట్రయల్స్ పూర్తయ్యేందుకు నాలుగైదున్నర నెలలు పట్టవచ్చని ఐసీఎంఆర్ ఆపరేషన్ గ్రూప్ ఫర్ కొవిడ్ టాస్క్ఫోర్స్ హెడ్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ట్రయల్స్ పూర్తి ఫలితాలు అక్టోబర్ చివరి నాటికి వస్తుందని భావిస్తున్నామన్నారు. నివేదికలు వచ్చిన కొద్ది రోజుల్లోనే పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించవచ్చన్నారు. ఈ ఏడాది నవంబర్ నాటికి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న టీకా వేయడం ప్రారంభమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొవాగ్జిన్తో పాటు కొవిషీల్డ్, పలు కంపెనీల టీకాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.