హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈసారి సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు. అందువల్ల భద్రాద్రి ఆలయంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్లైన్ ప్రసారాల ద్వారా వీక్షించాలని ప్రజలకు సూచించారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని శ్రీసీతారాములను సీఎం ప్రార్థించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడి ఆశీర్వాదంతో కొవిడ్-19పై విజయవంతంగా పోరాడి, ప్రజలు దాన్నుంచి బయటపడాలని ఆమె ఆకాంక్షించారు. మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.