న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు) లతోపాటు దేశంలోని టాప్ యూనివర్సిటీలు ఇక విదేశాల్లో తమ క్యాంపస్లను తెరువనున్నాయి. భారతీయ కళాశాలలను అంతర్జాతీయీకరించాలన్న నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా దేశీయ విద్యాసంస్థలు విదేశాల్లో క్యాంపస్లను తెరిచే పనిలో ఉన్నాయి.
మొదటి దశలో కేవలం కొన్ని ఎంపిక చేసిన విద్యాసంస్థలకు మాత్రమే విదేశాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆయా విద్యాసంస్థల క్యాటగిరీ, అకడమిక్ హిస్టరీ, బ్యాచ్ సైజు, కోర్సులు తదితర అంశాలను ఆధారంగా చేసుకుని విదేశాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేయబోయే విద్యాసంస్థల ఎంపిక జరుగనున్నది. మరో ఒకటి రెండు వారాల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన కాలేజీల జాబితాతోపాటు, అన్ని వివరాలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
కాగా, విదేశాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేసేది కేవలం విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికో, లేదంటే దేశీయ విద్యాసంస్థలకు ప్రపంచవ్యాప్త ప్రచారం కల్పించుకోవడానికో కాదు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యార్థుల ప్రతిభను చాటడానికి కూడా ఈ ఫారిన్ క్యాంపస్లు దోహదం చేస్తాయి. ఫారిన్ క్యాంపస్లవల్ల భారతీయ విద్యార్థులు తమ డిగ్రీ ప్రోగ్రామ్లలో పెండింగ్ పార్టులను అంతర్జాతీయంగా ఏర్పాటు కానున్న లొకేషన్లలో పూర్తిచేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం మన దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో దాదాపు 48,000 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మన పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, ఆఫ్రికా దేశాలకు చెందినవారే. అందుకే ప్రభుత్వం మన విద్యాసంస్థల పరిధిని మరింత విస్తరించాలని భావిస్తున్నది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యాసంస్థలకు టాప్ పొజిషన్ లేదని, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో మన విద్యాసంస్థలకు సముచిత స్థానం లేదని, ప్రస్తుతం ఈ పరిస్థితి మారాలని విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.