గుండెపోటుతో వధువు తండ్రి మృతి
రామాయంపేట రూరల్, ఏప్రిల్ 28: పెండ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. అన్నీ తానై తన కూతురు పెండ్లి చేసిన తండ్రి మరుసటి రోజే గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కోనాపూర్కు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి నక్క రాజారావ్ (62) సోమవారం కూతరు పెండ్లి చేసి అత్తగారింటికి సాగనంపాడు. కాగా, మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. దవాఖానకు తరలించేలోపే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు చోటు చేసుకున్నాయి.
గంజాయి మొక్కలు ధ్వంసం
చిలిపిచెడ్, ఏప్రిల్ 28: మండల పరిధిలోని బద్రియ తండాలోని బంజారానగర్ కాలనీలో ఓ వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న సమాచారంతో బుధవారం దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ధ్వసం చేశారు. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా నగర్ కాలనీలో మిర్చి పంటలో మోగావత్ కిషన్ గంజాయి మొక్కలు పెంచుతున్నాడని సమాచారంతో దాడులు నిర్వహించగా, మిర్చి పంటలో గంజాయి మొక్కలు ఉన్నాయన్నారు. సిబ్బందితో కలిసి ఆ మొక్కలను ధ్వంసం చేసి తగలబెట్టామ తెలిపారు. ఈ మేరకు మోగావత్ కిషన్పై కేసు నమోదు చేసి నర్సాపూర్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించామన్నారు. దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది సతీశ్కుమార్, అశ్వక్, చంద్రయ్య, రాజు, శ్రీధర్, నరేష్, హరీశ్, సురేశ్ ఉన్నారు.