కొచ్చి, మే 2: కేరళలో గత లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. కూటమిని నడిపించే బలమైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. వయనాడ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధినేత రాహుల్గాంధీకి కూడా ఈ ఓటమి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. చాలా చోట్ల అభ్యర్థులను మార్చి కొత్త వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం చేటు చేసింది. సీట్ల పంపకాల అనంతరం పార్టీ రెండుగా చీలింది. బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహించడంతో ఆ పార్టీని నిలువరించేందుకు ముస్లింలు, మైనార్టీలు ఎల్డీఎఫ్కే మొగ్గు చూపారు. అదేసమయంలో జోస్ కే మణి సారథ్యంలోని కేరళ కాంగ్రెస్ (ఎం)ని చివరి నిమిషంలో విజయన్ తమ కూటమిలో చేర్చుకోవడం ఆ పార్టీకి లాభించింది. గణనీయ స్థాయిలో ఉన్న క్రిస్టియన్లు ఆ కూటమివైపు మళ్లారు.