హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ) దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేండ్ల డిగ్రీకి బదులు కొత్త డిగ్రీ కోర్సులు అమల్లోకి రానుంది. నాలుగేండ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు.. రెండేండ్లకు బదులు ఏడాది కాలపరిమితితో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) పూర్తి చేయవచ్చు. 2013లోనే నాలుగేండ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నించింది. అయితే అప్పట్లో విద్యావేత్తలు, విద్యార్థుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. దీంతో అప్పట్లో నాలుగేండ్ల డిగ్రీ అమలు నిర్ణయాన్ని అధికారులు వాయిదావేశారు. తాజాగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టి, తర్వాత క్రమంగా అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టాలని యూజీసీ భావిస్తుంది. అయితే ఒక వైపు మూడేండ్ల డిగ్రీ కోర్సులను నిర్వహిస్తూనే, మరోవైపు నాలుగేండ్ల డిగ్రీలను నిర్వహించుకోవచ్చని అధికారులు స్పష్టతనిచ్చారు. అంతేకాకుండా వీటి అమలుపై నిర్ణయాధికారం కూడా ఆయా యూనివర్సిటీలకే అప్పగించారు.