సూర్యాపేట, జూలై 11 (నమస్తే తెలంగాణ)/తిరుమలగిరి/నీలగిరి : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరు జల్లులతో కూడిన ముసురు వాన పడింది. పలు చోట్ల భారీ వర్షం కురవగా అత్యధికంగా నాగారం మండలంలో 84మి.మీ., జాజిరెడ్డిగూడెంలో 82.5మి.మీ., దేవరకొండలో 68.9మి.మీ. వర్ష పాతం నమోదైంది. ముసురు కారణంగా వీధి వ్యాపారులు, సాధారణ ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతూనే గొడుగులు, స్వెటర్లు ధరించి పనులు పూర్తిచేసుకున్నారు. వర్షం కారణంగా వీధుల్లో వరద ప్రవహించి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సీజన్లో 185.0మి.మీ.కు గాను 134.7మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వానాకాలం సీజన్లో రెండో భారీ వర్షం కావడంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేయనున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలకు పంట చేలల్లో గుంటుకలు తిప్పి, కలుపు తీసి మందులు చల్లారు. పదిహేను రోజుల వరకు భూమిలో పదును ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
640.15 అడుగులకు మూసీ నీటిమట్టం
మూసీ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 640.15(3.25 టీఎంసీలు) అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి 980 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. 51క్యూసెక్కుల నీరు ఆవిరవుతున్నదని, ప్రస్తుతం ఔట్ ఫ్లో లేదని ఏఈ ఉదయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు.
గుట్ట పైనుంచిజాలువారిన వరద
నాగారం మండలం ఫణిగిరి గుట్ట జలపాతాన్ని మరిపించింది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి గుట్ట పైనుంచి వరద దుంకడంతో పాల నురగలాంటి నీరు కిందికి జాలువారుతూ కొండ కింద సీతారామచంద్రస్వామి గర్భాలయంలోకి చేరింది. గుట్ట పైనుంచి జాలువారడం ఇదే ప్రథమమని స్థానికులు తెలిపారు. జలపాతం దృశ్యాలు ప్రజలకు కనువిందు చేశాయి.
నాగార్జునసాగర్ జల సమాచారం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ఆదివారం నాటికి 529.30అడుగుల వద్ద 166.7838 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. డ్యాం ప్రధాన జల విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ, వరద కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. ఎస్ఎల్బీసీ ద్వారా 500క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. శ్రీశైలం నుంచి 5905క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.