న్యూఢిల్లీ: వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చించడానికి సిద్ధం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మంగళవారం ఆమె స్పందిస్తూ జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై తాము చర్చిస్తామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలన్నారు.
రాష్ట్రాలు మోటార్ టాక్స్ విధిస్తున్నాయన్న నిర్మల
ముడి చమురు దిగుమతిపై కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మోటార్ ట్యాక్స్ విధిస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇటీవలి కాలం వరకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకెళ్లాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ కేంద్ర ముడి చమురు సంస్థలు పెంచడం లేదు.
కొన్ని సిటీల్లో సెంచరీ దాటేసిన పెట్రోల్
కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ మార్క్ను దాటేశాయి. ఇదిలా ఉంటే, 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 300 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇంతకుముందు లోక్సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
పెట్రోల్ ధరలు అధికం నిజమేనన్న ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఇంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా ఎక్కువగానే ఉన్నాయని అంగీకరించారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల దేశీయంగా చమురు ధరలు పెరిగిపోయాయని కేంద్రం వాదిస్తున్నది.
ఇలా భారత్కు సౌదీ ఘాటు రిప్లయ్
ఇటీవల జరిగిన ఒపెక్ ప్లస్ సమావేశంలో ముడి చమురు ధరలను తగ్గించేందుకు ఉత్పత్తి తగ్గించాలని సౌదీ అరేబియాను భారత్ కోరింది. కానీ గతేడాది కరోనా టైంలో చౌక ధరకు కొనుగోలు చేసిన భారత్ ముడి చమురు నిల్వ చేసుకున్నదని, ముందు ఆ ధరకే మార్కెట్లో పెట్రోల్, డీజిల్ విక్రయించాలని సౌదీ అరేబియా ఘాటు రిప్లయి ఇచ్చింది.
భారత్కు చమురు సరఫరాలో అమెరికా రికార్డ్
గల్ఫ్ కేంద్రంగా ఒపెక్ ప్లస్ దేశాలు ప్రధానంగా చమురు ఉత్పత్తి చేస్తున్నా.. అత్యధిక ఉత్పత్తిదారు అమెరికాయే. భారత్కు ముడి చమురు సరఫరా ఎక్కువగా ఇరాక్ నుంచే జరుగుతుంది. సౌదీ అరేబియా ఉత్పత్తి తగ్గించడంతో భారత్కు ముడి చమురు సరఫరా చేసిన దేశాల జాబితాలో అమెరికా రెండో స్థానాన్ని ఆక్రమించింది.
అమెరికా నుంచి 48 శాతం ముడి చమురు దిగుమతి
గత నెలలో అమెరికా నుంచి 48 శాతం ముడి చమురు దిగుమతి పెరిగింది. అంటే ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 5,43,500 బీపీడీల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకున్నది. ఇది భారత్ ఓవరాల్ దిగుమతుల్లో 14 శాతం. సౌదీ అరేబియా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు 4,45,200 బీపీడీలకు తగ్గింది. ఇది దశాబ్ది కనిష్టంగా నమోదైంది.
సౌదీ నుంచి రికార్డు స్థాయిలో 42 శాతం తగ్గిన దిగుమతి
గతేడాదితో పోలిస్తే సౌదీ నుంచి దిగుమతి రికార్డు స్థాయిలో 42 శాతం తగ్గిపోయింది. తద్వారా భారత్కు ముడి చమురు ఎగుమతి చేసే దేశాల జాబితాలో సౌదీ నాలుగో స్థానానికి పడిపోయింది. 2006 జనవరి నుంచి ఇలా సౌదీ ర్యాంక్ పడిపోవడం తొలిసారి.
ఇవి కూడా చదవండి:
‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!