న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ దాదాపు పూర్తి కావచ్చింది. జులైలోపు ఇది మొత్తంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే థర్డ్ వేవ్ తప్పదన్న వార్తల నేపథ్యంలో అసలు అది ఎప్పుడు వస్తుందన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఐఐటీ కాన్పూర్ చేసిన అధ్యయనంలో కరోనా మూడో వేవ్ ఇండియాలో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య ఉండే అవకాశం ఉంది. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లయిన రాజేష్ రంజన్, మహేంద్ర వర్మలు తమ టీమ్తో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. ఆ వివరాలను సోమవారం వెల్లడించారు.
రెండో వేవ్ పారామీటర్లను పరిగణలోకి తీసుకొని ఎస్ఐఆర్ మోడల్ ఉపయోగించి థర్డ్ వేవ్ గురించి మూడు రకాల పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లు వీళ్లు చెప్పారు. జులై 15లోపు ఇండియా మొత్తం అన్లాక్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఆ లెక్కన మొదటి పరిస్థితి (సాధారణ పరిస్థితులు) వస్తే అక్టోబర్లో థర్డ్ వేవ్ పీక్ ఉంటుంది. అయితే ఇది సెకండ్ వేవ్ పీక్ అంత ఉండదు. ఇక రెండో పరిస్థితి (వైరస్ మ్యుటేషన్లతో సాధారణ పరిస్థితులు) సెకండ్ వేవ్ పీక్ కంటే ఎక్కువగా ఉండి సెప్టెంబర్లోనే రావచ్చు. మూడో పరిస్థితి (కఠిన ఆంక్షలు) చూసుకుంటే మూడో వేవ్ పీక్ అక్టోబర్ చివరి వరకూ ఆలస్యం కావచ్చు. ఇక్కడ సెకండ్ వేవ్ పీక్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
వీళ్ల అధ్యయనం ప్రకారం మిజోరం, మణిపూర్, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప సెకండ్ వేవ్ ముగిసిపోయింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 5 శాతం లోపే ఉంది. కొన్ని రాష్ట్రాల్లోనే ఇది 10 శాతానికిపైగా ఉంది.