దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రం
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చొప్పదండి, జూన్ 1: కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం చొప్పదండిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో మండలానికి చెందిన 39 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 39,04,524 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. గతంలో నిరుపేదల ఇంట్లో ఆడపిల్లల పెళ్లికి అప్పో, సప్పో చేసి నానాఇబ్బందులు పడేవారని, ఉద్యమంలో వారి బాధలను దగ్గర నుంచి చూసిన సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. వాటిని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజిత, నాయకులు మాచర్ల వినయ్, తొట్ల తిరుపతి, మావూరం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.