చందంపేట, మే 7 : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్లు ప్రకటిస్తున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసేసి బంద్ పాటిస్తున్నారు. చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని శుక్రవారం పోలేపల్లి గ్రామస్తులు, వ్యాపారస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. దుకాణాలు ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12వరకు తెరిచి ఉంచాలని, అనంతరం మూసివేయాలని తీర్మానించారు. ఈ విషయాన్ని చందంపేట ఎస్ఐ సందీప్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. చందంపేట మండల కేంద్రంలో ఎస్ఐ ప్రజలకు అవగాహన కల్పించారు. సమావేశంలో సర్పంచ్ కవిత, జంగమ్మ, అనంతగిరి, మోహన్ కృష్ణ, మహేశ్, శివ, శ్రీశైలం ఉన్నారు.
హాలియాలో ఒంటిగంట వరకే దుకాణాలు
హాలియా : ఈ నెలాఖరు వరకు హాలియా మున్సిపాలిటీలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని ఆ తరువాత వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని హాలియా మున్సినల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా మున్సిపాలిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఆమె తెలిపారు. అదేవిధంగా ఈ నెల 15వరకు హాలియాలో గోల్డ్ షాప్లు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శంభయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
డిండి : మండల కేంద్రంలో శుక్రవారం పూర్తిగా లాక్డౌన్ పాటించారు. వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పోలీసులు ఒకరోజు ముందే సమాచారం ఇవ్వడంతో వ్యాపారులు పూర్తిగా సహకరించారు.
వ్యాపార సంస్థల బంద్
దేవరకొండ : పట్టణంలో ఈ నెల 31వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బంద్ చేస్తున్నట్లు వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు ఆర్డీఓకు శుక్రవారం వినతిపత్రం అందించారు. పట్టణంలో అన్ని షాపులను బంద్ చేయనున్నట్లు తెలిపారు. వ్యాపార యజమానులు కుంచకూరి అశోక్, నీల బుచ్చయ్య, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీధర్గౌడ్, కృష్ణకిశోర్, భాస్కర్రెడ్డి, కరుణాకర్, రమేశ్ పాల్గొన్నారు.
గుర్రంపోడులో పాక్షిక లాక్డౌన్
గుర్రంపోడు : మండలంలో ఈ నెల 7నుంచి 22వరకు పాక్షిక లాక్డౌన్ నిర్ణయానికి అందరూ సహకరించాలని మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్గౌడ్, ఎస్ఐ రవి, సర్పంచ్ షేక్ మస్రత్సయ్యద్మియా కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యాపారులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని తీర్మానించారు.
చిట్యాలలో నేటి నుంచి..
చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 8నుంచి పాక్షిక లాక్డౌన్ విధిస్తూ మున్సిపాలిటీ పాలకవర్గం, అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష పార్టీల నాయకులు, పట్టణంలో వివిధ వ్యాపార వర్గాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంచాలని చైర్మన్ కోరారు. ఈ లాక్డౌన్ 15రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ నాగరాజు, వైద్యాధికారి కిరణ్కుమార్, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, జడల పూలమ్మ, రెముడాల లింగస్వామి, అఖిలపక్ష నాయకులు చికిలంమెట్ల అశోక్, కూరెళ్ల శ్రీను, అవిశెట్టి శంకరయ్య, వ్యాపారవర్గాల నుంచి శివకోటి యాదగిరి, వెంకటేశ్వర్లు, భాస్కర్రెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.
బంద్కు సహకరించాలి : సీఐ
దేవరకొండ : పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్కు సహకరించాలని దేవరకొండ సీఐ ఆదిరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. మధ్యాహ్నం 1గంట నుంచి ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా షాపులు బంద్ చేస్తున్న సందర్భంగా అందరూ సహకరించాలని కోరారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.