జడ్చర్లటౌన్, ఏప్రిల్ 20: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జోనల్, రూట్, నోడల్ అధికారులదే కీలకపాత్ర అని మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు శ్రీధర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జడ్చర్లలోని ప్రేమ్రంగా గార్డెన్ పంక్షన్హాల్లో నిర్వహించిన జోనల్, రూట్, నోడల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జోనల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రధానంగా సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై రెవెన్యూ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుగానే విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. జోనల్ అధికారులు ముందస్తుగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఆయా ప్రాంత పరిస్థితులపై అవగాహన కల్పించుకోవాల్సినవసరం ఉన్నదన్నారు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన షాడో రిజిస్టర్ను ఏర్పాటు చేసి అభ్యర్థుల ఖర్చుల వివరాలను తనిఖీ తేదీలను తెలియజేయాలన్నారు.
అలాగే అభ్యర్థుల ఖర్చు విషయంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల కీలకపాత్ర ఉంటున్నదన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీల్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఖర్చుల బుక్ను ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పంపిణీ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి నోడల్ అధికారి, జోనల్ అధికారి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి జారీ అయ్యే సూచనలు, సలహాలను పాటిస్తూ, మార్పులను గమనిస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు. అంతకుముందు అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి నోడల్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇతర ఏర్పాట్లపై వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబ్నగర్ ఆర్డీవో పద్మశ్రీ, నోడల్ అధికారులు, జోన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ, అదనపు కలెక్టర్తో ప్రత్యేక సమావేశం
జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరిశీలనకు వచ్చిన ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్ను మొదటగా జడ్చర్ల ఆర్అండ్ అతిథిగృహం వద్ద ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్ స్థానిక గెస్ట్హౌస్లో ఎస్పీ, అదనపు కలెక్టర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని నామినేషన్లు, ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బంది, సామగ్రి, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటపై అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన ఓటర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలను తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులకు పోలింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తు, పోలింగ్ సిబ్బంది నియామకం, వేతనాలు, భోజన ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో పద్మశ్రీ, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.