ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి టైటిల్ కోసం పరితపిస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ.. కొత్త కెప్టెన్ రాకతోనైనా జట్టు తలరాత మారుతుందేమోనని ఆశిస్తున్నది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో అతడి స్థానంలో రిషబ్ పంత్కు జట్టు పగ్గాలు అప్పగించిన మేనేజ్మెంట్.. ఈసారైన తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తున్నది. గత సీజన్లో తొలిసారి టైటిల్ ఫైట్కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే కనబర్చి కప్పు కొట్టాలని తహతహలాడుతున్నది. దేశీయ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం కాగా.. రబాడ, నోర్జే రూపంలో ఇద్దరు ప్రపంచ శ్రేణి పేసర్లు గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోలేకపోయిన యువ ఓపెనర్ పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలతో తన సత్తా ఏంటో చాటుకోగా.. ఇటీవల ఇంగ్లండ్ వన్డే సిరీస్తో శిఖర్ ధావన్ టచ్లోకి వచ్చాడు. ఇక మునుపెన్నడూ లేని రీతిలో రిషబ్ పంత్ ఫుల్ ఫామ్లో ఉండటం ఢిల్లీకి అదనపు బలం. ఈ నెల 10న చెన్నై సూపర్ కింగ్స్తో ఢిల్లీ ఈ సీజన్ను ఆరంభించనుంది.
భారత ఆటగాళ్లు: పంత్, ధావన్, పృథ్వీ షా, రహానే, అశ్విన్, అక్షర్, అమిత్ మిశ్రా, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఇషాంత్, అవేశ్ ఖాన్, ఉమేశ్ యాదవ్, రిపల్ పటేల్, విష్ణు వినోద్, లుక్మన్, సిద్ధార్థ్.
విదేశీ ఆటగాళ్లు: హెట్మైర్, స్టొయినిస్, వోక్స్, రబాడ, నోర్జే, స్మిత్, టామ్ కరన్, సామ్ బిల్లింగ్స్.