సమగ్రాభివృద్ధి, ప్రణాళిక రూపకల్పనకు సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం
4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఐదు నియోజకవర్గాలు, 33 లక్షల జనాభా, 10.89 కి.మీ. మేర అభివృద్ధి ప్రణాళిక సిద్ధం
త్వరలో అధికారులతో సమావేశం కానున్న మంత్రి మల్లారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
మేడ్చల్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. సమీకృతాభివృద్ధి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. దీంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. సమగ్రాభివృద్ధికి తక్షణమే ప్రణాళికలను సిద్ధం చేయాలని మేడ్చల్ జిల్లా అధికార యంత్రాంగాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేస్తూ మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రణాళికను రూపొందించనున్నారు. జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు మున్సిపాలిటీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నాలాల మరమ్మతులు, వెజ్-నాన్వెజ్ మార్కెట్ల ఏర్పాటు, వరద ముంపు సమస్య, చెరువుల సుందరీకరణ, ట్రాఫిక్ సమస్యలను ప్రణాళికలలో అధికారులు పొందుపరచనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వారం రోజుల్లో జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు సమావేశం కానున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. జిల్లాలో పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహార్నగర్, నిజాంపేట్లు కార్పొరేషన్లు కాగా, మేడ్చల్, ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ, నాగారం, తూంకుంట, గుండ్ల పోచంపల్లి, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలుగా ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉండటంతో అతి తక్కువ సమయంలో అభివృద్ధి చెందింది. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల పరిధిలు దాదాపుగా హైదరాబాద్ నగరానికి అనుసంధానమైనవి. జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అనేక నిధులను మంజూరు చేయడంతో త్వరితగతిన వృద్ధి పథంలో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు నిర్ణయంతో జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి మరింత వేగంగా పుంజుకుంటుంది.
మేడ్చల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ప్లాన్ను రూపొందించనున్నారు. జిల్లా పరిధిలో అనేక పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. జీవనోపాధి కోసం వచ్చిన ఇతర ప్రాంతాల ప్రజలు మేడ్చల్ జిల్లా పరిధిలో నివసిస్తున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు, రిజినల్ రింగు రోడ్డు లోపల అనేక భవనాలు వెలుస్తున్నాయి. ఇక్కడ నివసించే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు 2050 వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశం. ఐదు నియోజకవర్గాలు, 33 లక్షల జనాభా, 10.89 కిలో మీటర్ల విస్తర్ణం ఉన్న జిల్లాకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.
వారంలో రోజుల్లో జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు రూపొందించనున్న ప్రణాళికపై సమావేశం కానున్నాం. సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు పాల్గొంటారు. ఇందులో భాగంగా భవిష్యత్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందలు రాకుండా ఉండే విధంగా వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించనున్నాం. జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ముంపు సమస్య, చెరువుల సుందరీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రణాళికను రూపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. – కార్మిక శాఖ మంత్రి, చామకూర మల్లారెడ్డి