శాతవాహనులు (క్రీ.పూ 231- క్రీ.శ 225) మూల పురుషుడు- శాతవాహనుడు స్థాపకుడు- శ్రీముఖుడు రాజధాని-కోటి లింగాల, ప్రతిష్ఠానపురం/ పైఠాన్, ధాన్యకటకం రాజలాంఛనం- సూర్యుడు గొప్పవాడు- గౌతమీపుత్ర శాతకర్ణి
శాతవాహనుల కాలం నాటి ప్రజల జీవన విధానాలు తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు హాలుడి ‘గాథాసప్తశతి’, అమరావతి స్థూపంలోని శిల్పాలు దోహదపడతాయి. శాతవాహనుల కాలంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది.
గౌతమీపుత్ర శాతకర్ణి వర్ణాశ్రమ ధర్మపరిరక్షకుడిగా ఉంటూ ‘వర్ణ సంకర్యనిరోధక’ ‘క్షత్రియ ధర్పమాన’ బిరుదు పొందాడు.
యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో గజసేన, గజమిత్ర అనే సోదరులు భదాయనీయ బౌద్ధసంగమానికి గుహలు తొలిపించి దానంగా ఇచ్చారు.
శాతవాహన రాజులు పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. ఆహారానికి కుమారమహాత్య, అమాత్యులు అధికారులుగా వ్యవహరించగా, విషయాలకు విషయాధిపతి, గ్రామానికి గ్రామిక/ గోపుడు అధిపతిగా వ్యవహరించేవారు.
నాటి సమాజంలో సమష్టి (ఉమ్మడి) కుటుంబ వ్యవస్థ ఉండేది. యజమానిగా వ్యవహరించే తండ్రినే గహపతి/గృహపతిగా పిలిచేవారు.
ఈ సమష్టి కుటుంబ వ్యవస్థ ధర్మాల గురించి అమరావతి, కార్లే, నాసిక్ శాసనాల్లో పేర్కొన్నారు.
నాడు పితృస్వామిక వ్యవస్థ ఉన్నప్పటికీ స్త్రీలు సంఘంలో సముచిత గౌరవమర్యాదలు పొందారు.
దేవినాగనిక, గౌతమి బాలశ్రీ వంటి వారు బౌద్ధ ఆరామాలు, చైత్య విహారాల నిర్మాణాలను చేపట్టి పురుషులతో యజ్ఞయాగాదుల్లో పాల్గొనడంతో పాటు రాజకీయ వ్యవహారాల్లో సైతం పాలుపంచుకునేవారు.
రాజతంత్రం నడపడంలో, దానధర్మాలు, శాసనాలు చేయడంలో, గుహలను తొలిపించడంలో స్త్రీలు ముందు వరుసలో ఉండేవారని హాలుని ‘గాథాసప్తశతి’ ద్వారా తెలుస్తుంది.
చక్రవర్తులు కొందరు తమ పేర్లకు ముందు ‘మాతృసంజ్ఞలు’ ధరించడాన్ని బట్టి నాటి సమాజంలో స్త్రీలకు గల ప్రాధాన్యం అర్థమవుతుంది.
అజంతా, సాంచీ, అమరావతి శిల్పాలను అనుసరించి రాజులు ఆడంబర జీవితం గడిపేవారని, రాజాస్థానాలు వైభవోపేతంగా ఉండేవని చరిత్రకారులు తెలిపారు.
‘గాథాసప్తశతి’లో అత్త, పొడి, పొట్ట లాంటి తెలుగు పదాలతో పాటు తెలుగు వారు వివిధ సందర్భాల్లో పాడుకునే పాటలు ఉన్నాయి.
అమరావతి, కార్లే స్థూపాలపై చెక్కిన శిల్పాల్లోని స్త్రీలు, పురుష ప్రతిమలను బట్టి నాటి వస్త్రధారణ పద్ధతులు తెలుస్తున్నాయి. పురుషులు ధోవతి, ఉత్తరీయంతో పాటు తలపాగా ధరించేవారు. స్త్రీలు శరీరమంతా కప్పుకోవడానికి ఒకే వస్ర్తాన్ని (ఎర్రరంగు చీరను) వాడేవారు.
నాటి స్త్రీలకు ఆభరణాలు, నగలు అంటే మక్కువగా ఉండేది. వారు రింగులు, గాజులు, ఉంగరాలు, జుంకాలు, మురుగులు, వడ్డాణం, హారా లు ధరిస్తే, పురుషులు కర్ణాభరణాలు, మురుగులు, హారాలు ధరించేవారు.
నాటి సమాజంలో ప్రజలు ఎడ్లబండ్లు, శిబికలు (పల్లకీలు), రథాలు, పడవలు, ఏనుగులు, గుర్రాలను రవాణా సాధనాలుగా ఉపయోగించారు.
ఆచార వ్యవహారాలు
అపశకునాలను పాటించేవారు పండుగల్లో స్త్రీలు వాయనం (రకరకాల పదార్థాలు, వస్తువులు) ఇచ్చిపుచ్చుకునేవారు. స్త్రీలు ముఖానికి రంగు వేసుకునేవారు.
స్నానం చేసే సమయంలో పసుపు వాడేవారు. జంబూ కషాయం (అల్లనేరేడు చెట్ల ఆకులను) ఉపయోగించేవారు. హరితాల వస్తువులతో (ఆ కాలం నాటి రకరకాల మేకప్ రంగులు )ముఖానికి రంగు వేసుకునేవారు. గ్రామీణ జీవన విధానం ఉన్నత స్థాయిల్లోనూ, శాతవాహన సామ్రాజ్యమంతా ఆర్థికంగా బలపడి ఉంది. అప్పట్లో 18 రకాల వృత్తిపనివారు (అష్టాదశ వర్ణం) ఉండేవారు. హాలికులు- రైతులు సేఠీలు- వర్తక శ్రేణులు గధికులు- సుగంధ ద్రవ్యాలు, రసాయనాలు, తయారు చేసేవారు వధికులు- వడ్రంగులు కొలకులు- నేతపనివారు తిలపిసకారులు- నూనె తయారు చేసేవారు కమ్మరులు- ఇనుప పనిముట్లు తయారు చేసేవారు కులరికులు- కుమ్మరి పనివారు వెజులు- వైద్యులు వస్సాకరులు- వెదురు పనివారు శిలవధికులు- శిలలు చెక్కేవారు మీధికులు- మెరుగు పెట్టేవారు మాలకారులు- మాలలు కట్టి విక్రయించేవారు మణికారులు- రత్నాలు, మణులు పొదిగిన నగలు తయారు చేసేవారు.