హైదరాబాద్: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2021)కు సర్వం సిద్ధమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాలిసెట్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశామని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. కరోనా సోకిన అభ్యర్థులకు దవాఖానల్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అందువల్ల కరోనా పాజిటివ్ అభ్యర్థులు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాసర ఆర్జీయూకేటీకి ప్రత్యేక మెరిట్ జాబితాలు పంపిస్తామని చెప్పారు. వ్యవసాయ, పశువైద్య కోర్సులకు ప్రత్యేక మెరిట్ జాబితాలు రూపొందిస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ ప్రత్యక్ష తరగతులపై తొందరపడబోమని ఆయన చెప్పారు.
పాలిసెట్ పరీక్షను శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకోసం 1,02,496 మంది దరఖాస్తు చేసుకున్నారు. గంట ముందునుంచే పరీక్ష హాలులోకి అనుమతిస్తామని, 11 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.