న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరించడంతో గత ఏడాది మార్చి నుంచి దేశంలో విద్యాసంస్థలు మూడతపడ్డాయి. ఇది పాఠశాలలు, కాలేజీల్లో డ్రాపౌట్స్ బాగా పెరిగిపోవడానికి దారితీసింది. అదేవిధంగా విద్యార్థుల్లో అభ్యసన స్థాయిలు కూడా భారీగా పతనమవడానికి కారణమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలా..? వద్దా..? అనే మీమాంసలో రాష్ట్రాలు ఉండగా.. తాజాగా ఓ అధ్యయనం మాత్రం అత్యవసరంగా పాఠశాలలను పునఃప్రారంభించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.
ఇటీవల ఆజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ పాఠశాలలు మూతపడటంవల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టంపై ఒక సర్వే చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా వివిధ ప్రాథమిక పాఠశాలలకు చెందిన 16 వేల మంది విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించింది. విద్యార్థుల్లో దాదాపు అందరూ లాంగ్వేజ్ స్కిల్స్, మ్యాథ్స్ స్కిల్స్ మర్చిపోయారని సర్వేలో తేలింది. చిన్నారుల్లో దాదాపు 92 శాతం మంది విద్యార్థులకు కనీసం ఒక్క లాంగ్వేజ్పై పట్టులేదని బయటపడింది. అదేవిధంగా 82 శాతం మంది చిన్నారులు మ్యాథ్స్ స్కిల్స్ మర్చిపోయారని నిర్ధారణ అయ్యింది.
ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సీఈవో అనురాగ్ బెహర్ సర్వే వివరాలను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను అత్యవసరంగా తెరువాల్సిన అవసరం ఉన్నదని, అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఒక ప్రణాళికతో ఆ పని చేయాలని బెహర్ అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా దేశంలో నిరుపేదలకు ఆర్థిక సమస్యలు రెట్టింపు అయ్యాయని, దాంతో పిల్లలను చదువు మాన్పించి పనుల్లో పెడుతున్నారని ఆయన చెప్పారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే డ్రాపౌట్స్ మరింత పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. పిల్లలు చదువు మర్చిపోతారని, తర్వాత ఉన్న తరగతుల్లో పాఠాలు అర్థం చేసుకోవడం కష్టమవుతుందని చెప్పారు. అందుకే సరైన ప్రణాళికతో సాధ్యమైనంత త్వరగా పాఠశాలలను పునఃప్రారంభించడమే ఉత్తమమని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.