కరోనా విజృంభిస్తున్నవేళ.. రైతుకు ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. యాసంగి ధాన్యం అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. అన్నదాత మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. యాసంగిలో పండే ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది రైతుల నుంచి రూ.2,920 కోట్ల విలువైన 15.50 లక్షల టన్నులకు పైగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కరోనా మహమ్మారి వచ్చాక వరుసగా మూడు సీజన్లలోనూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులతో ఏటేటా ధాన్యం దిగుబడి భారీగా పెరుగుతున్నది. అదే సమయంలో కరోనా విజృంభిస్తుండంతో పంట అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పౌరసరఫరాల సంస్థ చర్యలు తీసుకొంటున్నది.
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పల్లెలు పసిడికాంతులు సంతరించుకుంటున్నాయి. అన్ని ఊళ్లలో ఏర్పాటుచేసిన ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం రాసులతో కళకళలాడుతున్నది. యాసంగిలో సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 6,798 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 6 వేల కేంద్రాలను ఏర్పాటుచేసింది. పంట కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తూ వస్తున్నది. కోతకు వచ్చే ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తూ క్రమంగా విస్తరిస్తున్నది. అవసరాన్నిబట్టి అదనంగా కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు కూడా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
రాష్ట్రంలో ఈ యాసంగిలో రికార్డుస్థాయిలో 1.32 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో కొంతమొత్తం మిల్లర్లు, ఇతర సంస్థలు కొనుగోలు చేయగా.. పౌరసరఫరాలశాఖ 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నది. గతేడాది యాసంగిలో రికార్డుస్థాయిలో 64.17 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. ఈసారి 80 లక్షల టన్నులను కొనుగోలు చేసి మరో రికార్డు సృష్టించనున్నట్టు తెలుస్తున్నది. ముందుగా పంట వేసిన ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తికాగా.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో కొనుగోళ్లు జోరందుకోనున్నాయి. కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యం కొనుగోళ్లలో అధికారులు ఎక్కడా జాప్యం చేయడం లేదు. పంట దిగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతున్నా.. ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ కరోనా కష్టాలు తప్పడం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు తీసుకొంటూనే.. మరోవైపు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. కరోనా కారణంగా హమాలీలు, లారీల కొరత ఏర్పడటంతో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీఏ కమిషనర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. తగినన్ని లారీలను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్శర్మకు లేఖ కూడా రాశారు. కొనుగోలు ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న సుమారు 120 మందికిపైగా ఉద్యోగులు, హమాలీలు కరోనాబారిన పడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకుపోతున్నది. ఎక్కడెక్కడ సమస్యలు ఎదురవుతున్నాయో గుర్తించి, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే లోడింగ్, అన్లోడింగ్, గన్నీ బ్యాగులు, రైతులకు డబ్బు చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల సంస్థ జిల్లాస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. రైతులు ధాన్యాన్ని విక్రయించిన రెండు మూడు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉన్నవారు మినహా ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన వారందరికీ డబ్బు చెల్లింపు ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా టీంను కూడా ఏర్పాటుచేశారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ధాన్యం విక్రయించిన రెండుమూడు రోజుల్లోనే డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో వారి ఆనందం మరింత ఎక్కువైంది. ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా సమస్యలు ఎదురైతే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల సంస్థ సూచించింది. ఇందుకోసం టోల్ఫ్రీ నంబర్ 1967, 1800-42500333ను అందుబాటులోకి తెస్తున్నది.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లగానే కాంటా పెట్టారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది పడలేదు. మొత్తం 332 క్వింటాళ్లు అక్కడే విక్రయించా. సుమారు రూ.6 లక్షలు రెండురోజుల్లోనే బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. తూర్పారబట్టి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకెళ్లడంతో మద్దతు ధర లభించింది. కరోనా కాలంలోనూ గ్రామంలోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వం ఆదుకున్నది. చాలా అనందంగా ఉన్నది.
-ఉద్మీర్ లక్ష్మణ్, రైతు, బోధన్
కరోనాతో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సమస్యలు ఎదురైనా వాటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల్లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం.
-మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, చైర్మన్, పౌరసరఫరాల సంస్థ
మొన్న వర్షాలకు మా వడ్లు తడిసిపోయినయ్. వాటిని కొంటరో లేదోనని భయపడ్డం. కానీ తడిసిన, రంగుమారిన వడ్లను కూడా కొంటమని అధికారులు చెప్పారు. ఇప్పుడు వాటిని ఆరపెడుతున్నాం. మా ధాన్యం సుమారు 300 క్వింటాళ్ల దాకా అవుతాయి. తడిసిన ధాతడిసిన ధాన్యమూ కొంటున్నారున్యం కూడా కొంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-పెంటారెడ్డి, రైతు, నందనవనం, భువనగిరి
గతంలో ఎన్నడూ పండని పంటలు ఈ యేడు చూసినం. ఇప్పుడు రైతులకు మేలు జరిగేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నరు. మా తండా పక్కన దురాజ్పల్లి దగ్గర కొనుగోళ్లు పెట్టిర్రు. ఈసారి మా పంట తొందరగా కో సినం. ఎప్పుడో పంట అమ్ముకున్నాం. డబ్బులు కూడా వచ్చినయ్.
–ధరావత్ పద్మ, వస్రాం తండా, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా
కష్టపడి పండించిన పంటను అమ్మితే ఒకేసారి డబ్బు రావడం ఆనందంగా ఉన్నది. ప్రభుత్వం ఇట్లా చేయడం మా అసొంటి రైతులకు ఎంతో మేలు. పంట వేసే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయం ఎంతో మేలుచేసింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
–రాసవేన భిక్షపతి-రైతు, వెంకటాపూర్, ములుగు