హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు తెలంగాణ పోలీసులు. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజనాన్ని పంపిణీ చేస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. ఐసొలేషన్లో ఉన్నవారికి, కొవిడ్ రోగులకు, దవాఖానల బయటే బస చేస్తున్న అనేకమందికి ‘సేవ ఆహార్’ పేరుతో పుష్టికరమైన మధ్యాహ్న భోజనం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వాట్సప్లో ఆహారం కావాలని చిన్న సందేశం పెడితే చాలు ఇంటివద్దకే భోజనాన్ని పంపిస్తున్నారు. పోలీస్శాఖలోని మహిళాభద్రత విభాగం అదనపు డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి నేతృత్వంలో మే3న ప్రారంభమైన సేవా ఆహార్ గత 22 రోజులుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అందజేస్తున్నారు. ఇప్పటికే 70వేలకుపైగా భోజనాలు ‘సేవాఆహార్’ ద్వారా అందించారు.
తెలంగాణ పోలీసుశాఖ, శ్రీసత్యసాయి సేవా సంస్థలు, లీడ్లైఫ్ ఫౌండేషన్, అక్షయపాత్ర, భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి, హోప్టీం, బిగ్బాస్కెట్, స్విగ్గీ తదితర సంస్థల సహకారంతో సేవా ఆహార్ నడుస్తున్నది. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లోని వంటశాలల్లో తయారు చేసిన ఆహారాన్ని ప్యాక్చేసి, 13 ఎంపిక చేసిన సెంటర్లకు చేర్చుతున్నారు. అక్కడి నుంచి బిగ్బాస్కెట్, స్విగ్గీ సంస్థలకు చెందిన డెలివరీ బాయ్స్ ద్వారా సంబంధిత అడ్రస్లకు చేరవేస్తున్నారు. దవాఖానల వద్ద ఉండేవారికి వలంటీర్ల ద్వారా ఆహార పొట్లాలను పంచుతున్నారు. ఇలా రోజుకు రెండువేల వరకు ఐసొలేషన్లో ఉన్నవారికి, మరో 1,500 వరకు దవాఖానల వద్ద రోగులు, వారి అటెండెంట్లకు భోజనం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆహారం అవసరం ఉన్నవారు ‘7799616163’ నంబర్కు మీ పేరు, లొకేషన్, ఫోన్నంబర్, ఎంతమందికి భోజనం కావాలి, ఎన్ని రోజులు కావాలి..అన్న వివరాలను వాట్సాప్లో పంపాలి. ఉదయం 6 గంటలలోపు వాట్సాప్ చేస్తేనే భోజనం అందిస్తున్నారు. ప్రతి ప్యాకెట్లో అన్నం, మూడు చపాతీలు, పప్పు, కూర, పెరుగు, సాంబారు, డ్రైఫ్రూట్స్ ప్యాకెట్ కిట్, నీళ్ల బాటిల్ను అందిస్తున్నారు.