మాదాపూర్, జూన్ 27: ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రభుత్వం లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లిలోని పలు చోట్ల రూ. 25 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారులను నేడు ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు, సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్తో కలిసి విప్ అరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హెచ్ఆర్డీసీఎల్ అధికారులతో కలిసి ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ .. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు లింకు రోడ్ల(సమాంతర రహదారులు) అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు.
కరోనా మహమ్మారితో అభివృద్ధి ఆగకూడదనే సీఎం కేసీఆర్ సంకల్పంతో కోట్ల రూపాయలను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పలు చోట్ల రహదారుల విస్తరణ చేపట్టామని వివరించారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి ముందస్తు చర్యల్లో భాగంగా లింకు రోడ్ల నిర్మాణాలకు తగిన నిధులను మంజూరు చేసి అభివృద్ధి పరిచిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు విప్ కృతజ్ఞతలు తెలిపారు.
కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం ప్రక్కన, మసీద్బండ ప్రభుపాద లే అవుట్ వద్ద కాగా నో హోటల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు రూ. 5.58 కోట్ల వ్యయంతో 0.600 కిలో మీటర్ల మేర బీటీ లింకు రోడ్డు, మియాపూర్ మెట్రో డిపో నుంచి కొండాపూర్ మజీద్ జంక్షన్ వరకు రూ. 2.87 కోట్ల వ్యయంతో 0.460 కిలో మీటర్లు మేర బీటీ లింకు రోడ్డు, వసంత సిటీ నుంచి న్యాక్ వరకు రూ. 7.41 కోట్ల వ్యయంతో 0.750 కిలో మీటర్ల మేర బీటీ లింకు రోడ్డును ప్రారంభించనున్నారు.
జేవీ హిల్స్ పార్క్ నుంచి మసీదుబండ వరకు వయా ప్రభుపాద లే అవుట్ హైటెన్షన్ లైన్ రోడ్డు వరకు రూ. 7.57 కోట్ల వ్యయంతో 1.010 కిలో మీటర్ల మేర బీటీ లింకు రోడ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నామని విప్ గాంధీ పేర్కొన్నారు. సమావేశానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు సంబంధిత అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హెచ్ఆర్డీసీఎల్ అధికారులు సీఈ జియావుద్దీన్, ఎస్ఈ రెహమాన్, ఈఈ సర్ధార్సింగ్ తదితరులు పాల్గొన్నారు.