ప్యాసింజర్ రైళ్లు రద్దవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వందల సంఖ్యలో రైళ్లను కుదిస్తూ రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. గత వారం రోజుల్లో దాదాపు 20 ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి బీదర్, ముంబయి, కర్నూలు సిటి, నాందేడ్ ఇలా.. అనేక మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. అదేవిధంగా శనివారం కూడా మరో 25 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కరోనా విజృంభణతో ప్రయాణికులు రాకపోవడంతో రైళ్ల ఆక్యుపెన్సీ తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రద్దు చేయాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయంటున్నారు. భవిష్యత్లో మరో 50 రైళ్ల రాకపోకలను కుదించే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. పూర్తిగా నష్టాలతో నడిచే ప్యాసింజర్ రైళ్లను ఎక్కువ కాలం నడుపలేకపోతున్నామని.. నష్టాలతో రైల్వే ఉద్యోగుల జీతాలు చెల్లించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయంటున్నారు.
ఓ పక్క ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్న అధికారులు.. మరోపక్క మాల్గాడీలను అభివృద్ధి చేస్తున్నారు. సరుకు రవాణా అధికంగా ఉన్న ప్రాంతాల్లో రెండు, మూడు, నాలుగు లైన్లతో కొత్త మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కూడా సరుకు రవాణా కోసం అదనపు మార్గాలు నిర్మిస్తున్నది. వాగులు, వంకలు, నదులపై వంతెనలు నిర్మిస్తున్నది. సిమెంట్ లాంటి పలు రకాల ఫ్యాక్టరీలను అనుసంధానం చేస్తున్నది. ఆయా మార్గాల్లో ట్రాక్లను బలోపేతం చేస్తున్నది. సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్ట పరుస్తూ కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నది. మరోవైపు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ సరుకు రవాణాపై దృష్టి పెట్టడంతో రైల్వే కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రైవేటీకరణలో భాగమేనని అభిప్రాయపడుతున్నారు.