లక్నో : సాధించాలనే పట్టుదల ఉంటే చాలు.. సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. దానికి తగ్గ కృషి చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. అలా 22 ఏండ్లకే ఓ యువకుడు ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో మెరిశాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన అతను.. 149 ర్యాంకు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు ఆదర్శ్ కాంత్ శుక్లా.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాకు చెందిన ఆదర్శ్ కాంత్ శుక్లా.. తల్లిదండ్రులు రాధాకాంత్, గీతా శుక్లా. రాధాకాంత్ ఓ ప్రయివేటు కంపెనీలో అకౌంటెంట్ కాగా, తల్లి గృహిణి. ఆదర్శ్ కాంత్ సోదరి స్నేహ ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అయితే తన కొడుకును సివిల్ సర్వెంట్ చేయాలన్నది రాధాకాంత్ బలమైన కోరిక. ఇదే విషయాన్ని ఆదర్శ్కు సందర్భం వచ్చినప్పుడల్లా తండ్రి చెప్పేవారు. అలా సివిల్ సర్వీసెస్ సాధించాలన్న తపన ఆదర్శ్లో మొదలైంది.
ఆదర్శ్ కాంత్ హైస్కూల్, ఇంటర్రీడియట్లో టాపర్. లక్నోలోని నేషనల్ పీజీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్)లో అత్యుత్తమ మార్కులు సాధించి బంగారు పతకాన్ని సంపాదించారు. ఇక డిగ్రీ పూర్తవగానే సివిల్స్ పై దృష్టి పెట్టిన ఆదర్శ్ తొలి ప్రయత్నంలోనే 149వ ర్యాంకు సాధించారు. అతను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఈ విజయాన్ని సాధించడం విశేషం. 22 ఏండ్ల వయసులోనే సివిల్స్ లో మెరుగైన ర్యాంకు సాధించడంతో పలువురు ఆదర్శ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.