ముంబై: నకిలీ కరోనా టీకాలతో హౌసింగ్ సొసైటీ సభ్యులను బురిడీ కొట్టించిన ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కండివాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వ్యాక్సినేషన్ స్కామ్లో తాము మోసపోయినట్లు స్థానిక హౌసింగ్ సొసైటీకి చెందిన 390 మంది సభ్యులు వాపోయారు. మే 30న హిరానందాని ఎస్టేట్ సొసైటీలో జరిగిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో డోసుకు రూ.1,260 చొప్పున వసూలు చేసి నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారని బాధితులు ఆరోపించారు. ఫెసిలిటేటర్ రాజేష్ పాండే అనే వ్యక్తి కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ప్రతినిధిగా పేర్కొంటూ సొసైటీ కమిటీ సభ్యులతో సంప్రదింపులు జరిపాడని, టీకా డ్రైవ్ను సంజయ్ గుప్తా సమన్వయం చేయగా, మూడవ వ్యక్తి మహేంద్ర సింగ్ సొసైటీ సభ్యుల నుంచి డబ్బులు సేకరించాడని వెల్లడించారు. అయితే టీకా వేయించుకున్న తర్వాత దానికి సంబంధించి తమకు ఎలాంటి మేసేజ్ రాలేదని, దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు తమకు నకిలీ టీకాలు వేసి మోసగించినట్లు గ్రహించామని పలువురు సొసైటీ సభ్యులు వాపోయారు.