హైదరాబాద్ : తెలంగాణలోని యూనివర్సిటీలు విశిష్ట నిలయాలుగా ఎదగాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణలోని వర్సిటీల ఉపకులపతులతో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళిసై బుధవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. గవర్నర్ ఆన్లైన్ సమీక్షకు 14 విశ్వవిద్యాలయాల వీసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. వర్సిటీలు పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాలుగా ఎదగాలన్నారు.
కరోనా సంక్షోభంపై శాస్త్ర, సామాజిక పరిశోధనలు జరగాలన్నారు. విద్యార్థులకు టీకాల అంశంలో విశ్వవిద్యాలయాలు చొరవ చూపాలన్నారు. తరగతులు, పరీక్షలు సకాలంలో నిర్వహించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలన్నారు. ఆన్లైన్ విద్యను అందుకోలేని పేదలకు సదుపాయాలు కల్పించాలన్నారు. డిజిటల్ విద్య అంతరాలను తగ్గించాలి గానీ పెంచకూడదని గవర్నర్ పేర్కొన్నారు.