కోల్కతా: పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ పర్యటించారు. సీతల్కుచి, కూచ్బెహర్తోపాటు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింస చెలరేగిన అన్ని ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ ధన్కర్కు కొందరు నల్ల జెండాలు చూపించి నిరసన తెలిపారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బెంగాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ హింసాత్మక ఘటనల్లో రెండు పార్టీల వైపు నుంచి 16 మంది కార్యకర్తలు మృతిచెందారు.