సూర్యాపేట టౌన్, మే 7 : సర్వమతాల సమ్మేళనాలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని.. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే రంజాన్ పండుగకు ప్రభుత్వ గుర్తింపు లభించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో కులమతాలు, రాజకీయాలకతీతంగా పాలన కొనసాగుతున్నదన్నారు. ఏడేండ్లుగా అన్ని మతాల పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకొంటున్నారని, ఇది ఐక్యతకు నిదర్శనమి తెలిపారు. అన్ని మతాల ప్రధాన పండుగలకు దుస్తులు, పండుగ సామగ్రితోపాటు ప్రత్యేక విందులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఇఫ్తార్ విందు నిర్వహించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్ పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, కౌన్సిల్ తాహెర్ పాషా, రియాజుద్దీన్, సల్మామస్తాన్ తదితరులు పాల్గొన్నారు.