అహ్మదాబాద్ : ఆవును హింసిస్తున్న వ్యక్తిని వారించినందుకు 17 ఏండ్ల బాలికను ఓ వ్యక్తి కర్రతో గాయపరిచిన ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వెలుగుచూసింది. మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అహ్మదాబాద్ లోని శాటిలైట్ ప్రాంతంలో నివసించే టీనేజ్ బాలిక ఇంటికి తిరిగివెళుతుండగా విశాల్ ఠాకూర్ గా గుర్తించిన నిందితుడు కర్రతో ఆవును కొడుతుండటం చూసి అతడిని వారించింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితుడు బాలిక తలపై కర్రతో కొట్టాడు. స్ధానికులు వెంటనే ఆమెను అసార్వాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఠాకూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.