ధైర్యం కోల్పోవద్దు ఆకుల సదానందబాయి
కరోనాను జయించిన 87 ఏళ్ల బామ్మ
కుభీర్,మే 2 : ‘నాడు గత్తర భీమారీ, గగ్గొండ్ల రోగం, కక్కుడుబైలు లాంటిదే ఈకరోనా.. అప్పట్లో ఇండ్లకు ఇండ్లు మూతపడ్డయి ఆ రోగాలతోని. ఇప్పుడు ఈకరోనా అసోంటిదే. సచ్చుడెప్పుడైనా తప్పదు. బుగులు పడితే చావుకు దగ్గరైతం. ధైర్యం కోల్పో వద్దు..’ఈ మాటలన్నది కుభీర్ మండలం పార్డి(కే) గ్రామానికి చెందిన ఆకుల సదానందబాయి. కరోనా సోకి 18రోజులు హోం ఐసొలేషన్లో ఉండి వైరస్ను జయించింది.. 87 ఏళ్ల బామ్మ. ‘నేను ఏప్రిల్ 10న ఊళ్లో ఓ పెళ్లికి పోయిన. అక్కడికి నాందేడ్ నుంచి బంధువులు వచ్చారు. ఎప్పటిలాగే రాత్రికి వచ్చి పడుకున్న. చలి పెడుతూ జ్వరం వచ్చింది. ఆరోజు గడిచింది. మళ్లీ మరుసటి రోజు రాత్రికి చలిజ్వరం వచ్చింది. 12వ తేదీ నాడు నా కొడుకు కుభీర్ తీసుకపోయి టెస్టు చేయిస్తే పాజిటివ్ వచ్చింది. ఒక్కదాన్నే ఇంట్లో ఉంటూ గవర్నమెంటోళ్లు ఇచ్చిన మందులు వాడిన. నాలుగు రోజులు జ్వరమొచ్చింది. మళ్ల రాలేదు. మూడు పూటలా ఆవిరి, తిండి పోక మూడు పూటలా గోధుమ అంబలి తాగిన. దగ్గు, దమ్ము వారం రోజుల తర్వాత తక్కువైంది. మాస్కు కట్టుకొని పనులన్నీ చేసుకుంటూ మందులు తిన్న. భయపడితే ఏదైనా వెంటబడతది. మనోధైర్యమే మందు’ అని తెలిపింది. ‘కరోనా పాజిటివ్ రాగానే మా అమ్మ బతుకదేమోనని అనుకున్న.. అయిపోయిందనుకున్న. కానీ మా అమ్మ చాలా గట్టిది’ అని కొడుకు ఆకుల లక్ష్మణ్ అన్నాడు.