ఫస్ట్వేవ్, సెకండ్వేవ్లలో ఇదీ తేడా
నాడు రోగులకు వెంటిలేటర్లు అత్యవసరమయ్యాయి
నేడు ఆక్సిజన్ అవసరం పెరిగింది
రెండోవేవ్లో కరోనావైరస్ తీవ్రత తక్కువ: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: గతేడాది కొనసాగిన కరోనా తొలి వేవ్లో వైరస్ బారిన పడ్డ వారికి వెంటిలేటర్ల అవసరం అధికంగా ఉండగా.. ప్రస్తుత సెకండ్వేవ్లో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటోంది. రెండోవేవ్లో రోగుల్లో వ్యాధి ఇతర లక్షణాల కంటే శ్వాస సమస్యే ఎక్కువగా ఉంది. ఫలితంగా మెడికల్ ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరిగింది. గత ఏడాది కరోనా మొదటి వేవ్లో ఆక్సిజన్ అవసరం 41.1 శాతం ఉండగా, ఇప్పుడు రెండో వేవ్లో అది 54.5 శాతానికి చేరింది. రెండో వేవ్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గింది. మొదటి, రెండో వేవ్లలో పలు అంశాలపై నిర్వహించిన అధ్యయనం వివరాలను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరామ్ భార్గవ, నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్ సోమవారం విలేకరులకు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో వేవ్లో కరోనా రోగుల్లో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు మొదటి వేవ్లో కంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొదటి వేవ్లో సర్వే చేసిన రోగుల్లో 41.7 శాతం మంది శ్వాస సమస్యతో బాధపడగా, రెండో వేవ్లో అది 47.5 శాతానికి పెరిగింది. రెండో వేవ్లో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ మొదటి వేవ్లో మాదిరిగా వెంటిలేటర్ అవసరం ఎక్కువగా లేదు. గతేడాది వెంటిలేటర్ అవసరం 37.3 శాతం ఉండగా ప్రస్తుతం 27.8 శాతానికి తగ్గింది. మరోవైపు, కరోనా రెండు వేవ్లలో కూడా 70 శాతం మంది రోగులు 40 ఏండ్లకు పైబడినవారే. ఇప్పటికీ వృద్ధులకే కరోనా ముప్పు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నది.