సీఎం కేసీఆర్ను కొనియాడిన లబ్ధిదారురాలు
కుభీర్, ఏప్రిల్ 17: మహారాష్ట్ర వాసికి తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా అందించింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన రైతు భార్య స్పందిస్తూ.. కేసీఆర్ పనితీరును కొనియాడారు. ఇలాంటి సీఎం తమ రాష్ట్రంలో ఉంటే బాగుండేదని అభిప్రాయడ్డారు. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా దెగ్లూర్ గ్రామానికి చెందిన సదాశివ్కు తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో సాగుభూమి ఉన్నది. ఇటీవల సదాశివ్ అనారోగ్యంతో మృతి చెందారు. రైతుబీమా కింద రూ.5 లక్షలు వస్తాయని, దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సర్పంచ్ శ్రీరాముల కవిత శుక్రవారం సదరు రైతు భార్య పద్మకు సమాచారం అందించారు. శనివారం ఆమె పల్సి పంచాయతీ కార్యాలయంలో రైతుబీమా పథకానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఏఈవో రాజుకు అందించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతికి చాలా కృషి చేస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ వంటి సీఎం తమకు కూడా ఉంటే రైతులు బాగుపడేవారని ఆమె అభిప్రాయపడ్డారు.