ములుగు, ఏప్రిల్17 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా వాటర్ అబ్గా మారింది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, దేవాదుల ద్వారా రామప్ప సరస్సు నిండు కుండను తలపిస్తూ వానకాలాన్ని మరిపిస్తున్నది. రామప్ప నుంచి లక్నవరం సరస్సులోకి సైతం గోదావరి జలాలను తరలించేందుకు మరో గ్రావిటీ కెనాల్ను నిర్మించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఎస్సారెస్పీ కెనాల్ డీబీఎం 37, 38 ద్వారా నీటిని విడుల చేయడంతో జిల్లా కేంద్రంలో లోకం చెరువుతోపాటు మండలంలోని పలు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. లోకం చెరువు మూడేండ్లుగా పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉండటంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఇటీవల కాసిందేవిపేటలోని పల్లె ప్రకృతి వనం వద్ద వేసిన బోరు బావిలో మోటర్ల సహాయం లేకుండానే నీరు పైకి ఉబికి వచ్చింది.