పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
పరిసరాల శుభ్రతకు పెద్దపీట
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనం
ఉత్తమ పంచాయతీగా ప్రశంసాపత్రం
అద్దంలా మెరుస్తున్న సీసీ రోడ్లు
చిన్నగూడూరు, మార్చి 27: చిన్నగూడూరు మండలంలోని విస్సంపల్లి గ్రామ జనాభా 2373. నివాస గృహాలు 471 ఉన్నాయి. రెండు విడుతలుగా అమలు చేసిన పల్లెప్రగతితో గ్రామ రూపురేఖలు మారి, అభివృద్ధికి నమూనాగా మారింది.ప్రభుత్వం ఇచ్చిన నిధులను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఖర్చు చేసి గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రతకు నిలయంగా తీర్చిదిద్దుకున్నారు. గ్రామంలో ఇప్పటికే వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతివనం పనులు పూర్తయ్యాయి. రహదారితోపాటు ఇంటింటా మొక్కలు నాటి, వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేసి ప్రతి రోజూ నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. జీపీ సిబ్బంది నిత్యం ఇంటింటికీ తిరిగి ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నా రు. ప్రతి వీధిలో ఎల్ఈడీ లైట్లు అమర్చారు. గ్రామ శివారులోని గుట్ట పక్కన ఏర్పాటు చేసిన ప్రకృతివనం అద్భుతంగా ఉన్నది. గ్రామస్తులకు ఆ హ్లాదాన్ని పంచుతున్నది. పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు సుమారు 4200 వరకు నాటారు. సుమారు రూ.13 కోట్లతో గ్రామంలోని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించారు. మొత్తంగా పల్లెప్రగతి సమర్థవంతంగా అమలవడంతో గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. 2020, జనవరి 26న అప్పటి కలెక్టర్ శివలింగయ్య చేతులమీదుగా సర్పంచ్ విద్యుల్లత ప్రశంసాపత్రం అందుకున్నారు.