చెన్నై: తమిళనాడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలు మరోసారి అధికార అన్నాడీఎంకే పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మదురై తూర్పు నియోజకవర్గంలో మాట్లాడిన ఆయన.. దేశంలోనే అత్యంత మోసపూరితమైన పార్టీ డీఎంకే అని మండిపడ్డారు.
డీఎంకే మోసపూరిత పార్టీ అనే విషయాన్ని కేవలం తాను చెప్పడం లేదని, టీవీ చానెళ్లలో వస్తున్న వార్తలే రుజువు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి చీటింగ్ పార్టీకి ఎదురొడ్డి అన్నాడీఎంకే అభ్యర్థులు పోరాటం చేస్తున్నారని పళనిస్వామి పేర్కొన్నారు.
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నాలుగేండ్లలో ఒక్కటంటే ఒక్క మతకలహంగానీ, కుల ఘర్షణలుగానీ జరగలేదని పళనిస్వామి చెప్పారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలన్నారు.
డీఎంకే అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులు తమ వ్యాపారం చేసుకోలేరని పళనిస్వామి హెచ్చరించారు. ప్రతి దుకాణం నుంచి వాళ్లు మామూళ్లు వసూలు చేస్తారన్నారని ఆరోపించారు. అయినా కట్ట పంచాయతీలు చేసేవారు ఈ రాష్ట్రానికి అవసరమా..? అని ఎద్దేవా చేశారు.