లక్నో: అక్రమ రీఫిల్లింగ్ షాపులో 18 గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉమ్రీ బేగమ్గంజ్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ షాపులో ఆదివారం గ్యాస్ సిలిండర్లు పేలాయి. పేలుడు ధాటికి ఆ షాపు పైభాగం ఎగిరిపోయింది. మంటలకు అందులోని సుమారు 18 గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత మరొకటి పేలాయి. ఈ నేపథ్యంలో సమీపంలోని షాపుల్లో ఉన్నవారు, స్థానికులు భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మంటలకు పక్కన ఉన్న మొబైల్ షాపు పూర్తిగా కాలిపోగా, మరో మూడు షాపులకు నష్టం కలిగింది. బాబు అనే వ్యక్తి సిలిండర్లలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మొదట ఒక సిలిండర్ పేలడంతో అందులో పనిచేసే వాళ్లు భయంతో బయటకు పరుగులు తీసినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో అందులో 40 గ్యాస్ సిలిండర్లు ఉండగా సుమారు 18 పేలి ఉంటాయని అనుమానిస్తున్నారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్థానికులు తమ మొబైల్లో తీసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.