హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను రోజుకు 50వేలకు పెంచాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్కే భవన్లో ఇతర రాష్ర్టాలతో సరిహద్దు ఉన్న నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల డీఎంహెచ్వోలు, ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కరోనా తాజా పరిస్థితిపై మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి వస్తున్నవారిపై దృష్టి సారించాలని సూచించారు.