కొత్త నాగార్జున కాలనీలో రూ. 5 లక్షలతో గ్రౌండ్ నిర్మాణం
పూర్తికావస్తున్న పనులు.. త్వరలో అందుబాటులోకి..
సీసీసీ నస్పూర్, మార్చి 12 :సింగరేణిలో పెద్ద ఏరియా శ్రీరాంపూర్. ఇక్కడ పది వేల మంది పై చిలుకు కార్మికులు, అధికారులు పని చేస్తున్నారు. వీరి సౌకర్యార్థం యాజమాన్యం క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే శ్రీరాంపూర్ ఏరియాలో రెండు క్రీడామైదానాలుండగా, సింగరేణిలోనే అతిపెద్ద కాలనీగా ఉన్న సీసీసీ నస్పూర్లో క్రీడా మైదానం లేదు. దాదాపు రెండు కిలోమీటర్లకు పైగా నస్పూర్కాలనీ, గోదావరికాలనీ(షిర్కె), పాత నాగార్జునకాలనీ, కొత్త నాగార్జునకాలనీల్లో 3500 సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. కార్మికులు ఎక్కువగా నివాసముండే ఇక్కడ స్టేడియం నిర్మించాలని అధికారులు, నాయకులను కార్మిక కుటుంబాల సభ్యులు అడుగుతూ వచ్చారు. దీంతో సింగరేణి అధికారులు కొత్త నాగార్జునకాలనీలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరాంపూర్ సివిల్ డీజీఎం శివరావు పర్యవేక్షణలో క్రీడా మైదానం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.
మూడు మైదానాలు..
అత్యధిక కార్మిక కుటుంబాలు నివసిస్తున్న కొత్త నాగార్జునకాలనీలో సింగరేణి యాజమాన్యం మరోగ్రౌండ్ను తయారు చేసింది. ఇప్పటికే శ్రీరాంపూర్లో ప్రగతి స్టేడియం, కృష్ణకాలనీలో శాంతి స్టేడియం ఉంది. అయితే వీటితో పాటు గతంలో నాగార్జునకాలనీ పక్కన గౌతమి స్టేడియం ఏర్పాటు చేసినప్పటికీ ఆ గ్రౌండ్ను తాళ్లపల్లి భూ నిర్వాసితుల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. తర్వాత నందనవనం పార్కు వెనకాల కుమ్రం భీం పేరిట మరో మైదానం ఏర్పాటు చేయగా, కంపెనీ అవసరాల దృష్ట్యా ఈ మైదానం స్థలాన్ని సింగాపూర్ భూ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. దీంతో ఈ ప్రాంత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు గ్రౌండ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు కొత్త నాగార్జున కాలనీలో యాజమాన్యం క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నది. ఈ మైదానం అందుబాటులోకి వస్తుండడంతో ఇక్కడి కార్మిక కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మైదానం ఏర్పాటుతో శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న రెండు క్రీడా మైదానాలతో పాటు మూడో గ్రౌండ్ కార్మిక కుటుంబాలకు అందుబాటులోకి రానున్నది.