ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. విశ్వాస పరీక్షకు నిలిచారు. శనివారం రోజున జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ఆయన విశ్వాసపరీక్షలో పాల్గొనున్నారు. ఇటీవల ఇస్లామాబాద్ సేనేట్ సీటు కోసం జరిగిన ఎన్నికల్లో పీటీఐ పార్టీ అనూహ్య ఓటమి చవిచూడడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఇమ్రాన్ ఇవాళ రాత్రి జాతిని ఉద్దేశించి కూడా రేడియోలో మాట్లాడనున్నారు. దేశంలో రాజకీయ అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగే విశ్వాస పరీక్షకు ఎంపీలంతా హాజరుకావాలంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి చౌదరీ ఫవద్ హుస్సేన్ తెలిపారు. తన ట్విట్టర్లో ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు. శనివారం 12.15 నిమిషాలకు విశ్వాస పరీక్ష ఉంటుందన్నారు. సేనేట్ చైర్మన్ పదవి కోసం పీటీఐ పార్టీ సాదిక్ సంజ్రానిని బలపరుస్తోంది.
ప్రతిపక్షం చేతిలో ఇస్లామాబాద్ సేనేట్ సీటు కోల్పోవడం వల్ల ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రి షా మెహమద్ ఖురేషి తెలిపారు. సేనేట్ కోసం విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన యుసుఫ్ రాజా గిలానీ ఆ సీటును కైవసం చేసుకున్నారు. గిలానీకి 169 ఓట్లు రాగా.. అబ్దుల్ హఫీజ్ షేక్కు 164 ఓట్లు వచ్చాయి. ఇమ్రాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ సభ్యులు విపక్ష అభ్యర్థికి ఓటు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈజీగా గెలవాల్సిన సీటును పీటీఐ కోల్పోవడం పట్ల ఇమ్రాన్ అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.