తిరుపతి:
సాంకేతిక నైపుణ్యంతోపాటు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలను కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారేందుకు ఈ నైపుణ్యాలు ఎంతగానో ఉపయుక్తమవుతాయని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి ఐఐటీ ఆరో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ ఆవరణలో ఐఐటీ విద్యార్థులతో గురువారం ఉపరాష్ట్రపతి ముచ్చటించారు. పలువురు విద్యార్థులకు పట్టాలు బహూకరించారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని సామాజిక అవసరాలతో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు.
భారతదేశ నిర్మాణరంగ అభివృద్ధిలో సాంకేతికత అత్యంత కీలకమని, ఈ దిశగా మన నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని వెంకయ్యనాయుడు సూచించారు. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే శాస్త్ర, సాంకేతికతల ప్రాథమిక లక్ష్యం కావాలన్నారు. సాంకేతికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణ, మారుతున్న వాతావరణ పరిస్థితులపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశ ఆర్థికాభివృద్ధితోపాటు ఆరోగ్యాభివృద్ధి కూడా కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
మారుతున్న భారతదేశ ప్రజల ఆకాంక్షలను ఐఐటీలు ప్రతిబింబించాలని చెప్పారు. ‘ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరచాల్సిన తక్షణావసరం ఉన్నదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృభాషలో విద్యాబోధన ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయినుంచే విషయాసక్తి, సృజనాత్మకత పెరుగుతాయన్నారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతతోపాటు.. ప్రాచీన భారత సంస్కృతిని కూడా ఒంటబట్టించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఐఐటీలు విజ్ఞానకేంద్రాలుగా మంచి పేరు తెచ్చుకుంటున్నాయని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి.. ఈ ఘనతను కొనసాగించేందుకు మరింతగా శ్రమించాల్సి ఉంటుందన్నారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో తిరుపతి ఐఐటీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘థర్మల్ ఎయిర్ స్టెరిలైజర్’ ఎన్95 పునర్వినియోగ మాస్క్లు, ఛాతీ ఎక్స్రే ద్వారా సాధారణ న్యుమోనియా, కరోనా బాధితులను వేర్వేరుగా గుర్తించడం తదితర పరికరాలను రూపొందించడం అభినందనీయమన్నారు. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్.. రెండు సంస్థలున్న ఏకైక నగరంగా తిరుపతి ప్రత్యేకతను సంతరించుకున్నదని వెంకయ్యనాయుడు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుపతి ఐఐటీ డైరక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తోపాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.