తెలంగాణ నదీ వ్యవస్థ
రాష్ట్రంలో గోదావరి 79 శాతం, కృష్ణానది 69 శాతం పరీవాహక ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. వీటితో పాటు భీమ, మంజీరా, మూసీ, ప్రాణహిత, తుంగభద్ర, కిన్నెరసాని, పాలేరు తదితర నదులు ఉన్నాయి.
గోదావరి
ఇది దేశంలో రెండో అతిపెద్ద నది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది. దీనికి దక్షిణ గంగ, వృద్ధగంగ, ఇండియన్ రైన్ అనే పేర్లు ఉన్నాయి. ఈ నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ జిల్లాలోని ‘త్రయంబకం’ వద్ద జన్మిస్తుంది. ఈ నది మహారాష్ట్ర ద్వారా ప్రవహించి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
మొత్తం పొడవు 1,465 కి.మీ
తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రవహిస్తూ ఏపీలోకి ప్రవేశిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి దిగువన 7పాయలుగా చీలి కొంత దూరం ప్రవహించిన తర్వాత బంగాళఖాతంలో కలుస్తుంది.
ఉపనదులు- ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి, ప్రవర, శబరి, సీలేరు, వార్ధా, పూర్ణ, వెయిన్గంగ, పెన్గంగ, మానేరు మొదలైనవి ముఖ్య ఉపనదులు
తెలంగాణలో గోదావరి ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలు- బాసర (ఆదిలాబాద్), కాళేశ్వరం, ధర్మపురి (కరీంనగర్), భద్రాచలం (ఖమ్మం)గోదావరి ఉపనది అయిన కడెం నదిపై కుంతల జలపాతం ఉన్నది.
ప్రాణహిత నది
మధ్యప్రదేశ్లోని సాత్పూర పర్వతాల్లో జన్మిస్తున్న ‘వెయిన్గంగ’ మహారాష్ట్రలో జన్మిస్తున్న ‘పెన్గంగ’ ‘వార్ధా’ అనే మూడు చిన్న నదుల కలయికతో ప్రాణహిత ఏర్పడుతుంది. ఇది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ద్వారా ప్రవహించి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. తర్వాత ఇది ఆదిలాబాద్ సరిహద్దు ద్వారా ప్రవహిస్తూ కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించి, మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలుస్తుంది.
మంజీరా నది
మహారాష్ట్రలోని‘బాలాఘాట్’ పర్వతాల్లో మంజీరా జన్మిస్తుంది. అక్కడ ఆగ్నేయ దిశగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల ద్వారా ప్రవహించి, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది.
రాష్ట్రంలో ప్రధానంగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ నదీ పరీవాహక ప్రాంతం ఉంది. సంగారెడ్డి పట్టణ సమీపంలో సింగూరు రిజర్వాయర్ నిర్మించారు.
కిన్నెరసాని
వరంగల్ జిల్లాలోని మేడారం-తాడ్వాయి కొండసానువుల్లో జన్మించి ఆగ్నేయ దిశగా ప్రవహిస్తుంది. ఖమ్మం జిల్లా ద్వారా ప్రవహిస్తూ భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్య గోదావరిలో కలుస్తుంది.
దీని పొడవు సుమారు 96 కి.మీ
కిన్నెరసాని ఉపనదీ అయిన ముర్రేడు కొత్తగూడెం పట్టణం ద్వారా ప్రవహిస్తోంది. ఇది సంగం గ్రామాల వద్ద కిన్నెరసానితో కలుస్తోంది.
కృష్ణానది
భారత్లో మూడో అతిపెద్ద, దక్షిణ భారత్లో రెండో అతిపెద్ద నది. ఇది పశ్చిమ కనుమ ల్లో మహారాష్ట్రలోని ‘మహాబలేశ్వరం’ వద్ద జన్మిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ప్రవహిస్తూ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రవహిస్తుంది. మొత్తం పొడవు 1400 కి.మీ.
ఉపనదులు- భీమ, డిండి, మూసీ, పెద్దవాగు, మలప్రభ, తుంగభద్ర, హాలియా, పాలేరు, మున్నేరు, కోయ్నా, పంచగంగ, దూద్గంగ
కృష్ణానదిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రావులపల్లి సమీపంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మించారు.
తుంగభద్ర
కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో జన్మించే తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని ‘చిక్మంగ్ళూరు’ జిల్లాలో ఒకదానితో ఒకటి కలిసి‘తుంగభద్ర’గా ఏర్పడుతున్నాయి?
ఈ నది మహబూబ్నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు ద్వారా ప్రవహించి, ఏపీలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.
ఉపనదులు- కుముద్వతి, వరద, వేదవతి
డిండి
మహాబూబ్నగర్ జిల్లాలోని షాబాద్ కొండల్లో జన్మిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ద్వారా ప్రవహించి ‘ఏలేశ్వరం’ దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.
మూసీ నది
రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ సమీపంలోని శివారెడ్డి పేట దగ్గర అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ద్వారా ప్రవహించి నల్లగొండ జిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నదికి మరోపేరు ముచికుంద.
ఈసా, ఆలేరు దీనికి ఉపనదులు. మూసీపై 1920లో ఉస్మాన్సాగర్ డ్యామ్ను నిర్మించారు. దీన్నే గండిపేట చెరువు అని పిలుస్తారు.
పాలేరు
వరంగల్ జిల్లాలోని బాణాపురం ప్రాంతంలో ఈ నది జన్మిస్తుంది. నల్లగొండ, ఖమ్మం జిల్లా సరిహద్దు మీదుగా ప్రవహించి, ఏపీలోని కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది.
నిజాం కాలంలో ఖమ్మం జిల్లాలోని పాలేరు పట్టణ సమీపంలో ఈ నదిపై రిజర్వాయర్ నిర్మించారు. పొడవు 145 కి.మీ
మున్నేరు
వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు నుంచి మున్నేరు ఉద్భవిస్తుంది. వరంగల్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రవహించి ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ తాలుకాలోని ఏలూరు వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు 192 కి.మీ
వైరా, కట్లేరు ముఖ్యమైన ఉపనదులు