న్యూఢిల్లీ : ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో మార్కెట్ నుంచి రూ 8,250 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓ జారీ చేసేందుకు బుధవారం సెబీ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లు షేర్లు విక్రయించడంతో పాటు తాజా షేర్ల జారీ ద్వారా రూ 8250 కోట్లు సమీకరించనున్నట్టు ముసాయిదాలో కంపెనీ పేర్కొంది. ఐపీఓ ద్వారా సమకూరే నిధుల్లో రూ 5265 కోట్లను కంపెనీ విస్తరణ, వృద్ధి కోసం వెచ్చిస్తారు.
మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ కార్యకలాపాల కోసం వినియోగించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో జొమాటో రాబడి రూ 2605 కోట్లు గా నమోదైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జొమాటో టైగర్ గ్లోబల్, కొరా వంటి పలు వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి రూ 1800 కోట్ల నిధులను సమీకరించింది. గత కొన్నేండ్లుగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ఎదుగుతున్న క్రమంలో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకునేందుకు జొమాటో, స్విగ్గీ తలపడుతున్నాయి.